లెజెండరీ సింగర్ ఈజ్ బ్యాక్

అద్నాన్ సమి.. పేరుకు పాకిస్థానీ అయినా.. ఈ లెజెండరీ సింగర్‌కు ఎక్కువ పేరు వచ్చింది ఇండియన్ సినిమాలతోనే. ఒక దశలో తన పాటతో ఎంతగా ఆకట్టుకున్నాడో.. 200 కిలోలకు పైగా బరువుతో, భారీ అవతారంలో అదే స్థాయిలో జనాల దృష్టిని ఆకర్షించాడు. అంత బరువున్న వాడు తర్వాత సర్జరీ చేయించుకుని సన్నగా మారడం ఓ సంచలనం. ఇక అద్నాన్ పాడిన హిందీ, తెలుగు పాటల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.

తెలుగులో నచ్చావే నైజాం పోరి (వర్షం), ఏ జిల్లా ఏ జిల్లా (శంకర్ దాదా ఎంబీబీఎస్), భూగోళమంత సంచిలోనా (శంకర్ దాదా జిందాబాద్), నేనంటే నాకు (ఊసరవెల్లి) లాంటి పాటలతో ఆయన ఇక్కడ బాగానే అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ పాటలన్నీ కూడా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినవే అన్న సంగతి తెలిసిందే. ఐతే ‘ఊసరవెల్లి’ తర్వాత అద్నాన్ తెలుగులో పాటలు పాడినట్లు లేడు.

పాకిస్థాన్‌కు గుడ్‌బై చెప్పేసి ఇండియన్ సిటిజన్‌షిప్ తీసుకుని మనదేశంలోనే సెటిలైపోయిన అద్నాన్ సమి.. ఎక్కువ హిందీ చిత్రాలకే పరిమితం అయిపోయాడు. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండరీ సింగర్ తెలుగులో పాట పాడడం విశేషం. ఇప్పటికే చిరంజీవికి రెండు పాటలు పాడిన సమి.. రీఎంట్రీ కూడా చిరు సినిమాతోనే ఇస్తున్నాడు.

మరోసారి దేవిశ్రీ ప్రసాదే ఆయనతో పాట పాడించాడు. ‘వాల్తేరు వీరయ్య’ కోసం ఇదంతా జరిగింది. ఈ సినిమా నుంచి ‘నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా’ అంటూ సాగే పాట గురించి చిరు స్వయంగా లీక్ చేసిన సంగతి తెలిసిందే. చిరు లీక్ చేసిన ట్రాక్‌లో దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ వినిపించింది. నిజంగా ఆ పాటను దేవీనే పాడాడేమో అని కొందరు కంగారు పడ్డారు. కానీ ఒరిజినల్ సాంగ్ పాడింది అద్నాన్ సమి అని తెలిసి హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంత గ్యాప్ తర్వాత చిరు కోసం మళ్లీ అద్నాన్ తెలుగు పాట పాడడంతో అది చాలా స్పెషల్‌గా ఉంటుందన్న అంచనాతో ఉన్నారు. కొన్ని రోజుల్లోనే ఈ పాట రిలీజ్ కాబోతోంది.