‘కార్తికేయ-2’ దెబ్బకు పేంచేశాడు?

ఒక పెద్ద హిట్ పడగానే హీరో హీరోయిన్లు పారితోషకాలను పెంచేయడం ఇండస్ట్రీలో మామూలే. సినిమాల బిజినెస్ జరిగేది ప్రధానంగా వీరి పేరు మీదే కాబట్టి పారితోషకం పెంచడాన్ని తప్పుబట్టలేం కూడా.

ఐతే ఆ పెంపు మరీ ఎక్కువ ఉంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అది కరెక్టేనా అనిపిస్తుంది. ఇప్పుడు యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ విషయంలో ఇదే చర్చ నడుస్తోంది. నిఖిల్ తన కొత్త చిత్రానికి ఏకంగా రూ.8 కోట్ల పారితోషకం పుచ్చుకోబోతున్నాడన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

నిఖిల్ ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడి చివరి సినిమా ‘కార్తికేయ-2’ అసాధారణ విజయం సాధించింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా సాధించిన వసూళ్లు షాకింగ్ అనే చెప్పాలి. నిఖిల్ స్థాయికి వంద కోట్ల వసూళ్లు అన్నవి ఊహకు అందని విషయం. ‘కార్తికేయ-2’ ఆ అసాధారణ ఘనతను అందుకుంది.

దీని తర్వాత నిఖిల్ నుంచి రాబోతున్న ‘18 పేజెస్’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే అది ఒక సగటు లవ్ స్టోరీ కావడంతో పాన్ ఇండియా రిలీజ్‌ వద్దనుకుంటున్నాడు నిఖిల్.

అక్కడ తనపై పెరిగిన అంచనాలకు తగ్గ సినిమాలే అందించాలనుకుంటున్నాడు. ఇందుకోసమే ‘కార్తికేయ-3’ను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం దర్శకుడు చందూ మొండేటి ఆ స్క్రిప్టు మీదే పని చేస్తున్నాడు.

ఈ సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే పారితోషకం రూ.8 కోట్లు పుచ్చుకోబోతున్నాడట నిఖిల్. ఈ సినిమాకు జరిగే బిజినెస్‌ను బట్టి చూస్తే అది మరీ పెద్ద నంబరేమీ కాదు.

కానీ నిఖిల్ చేసే వేరే చిత్రాలకు కూడా ఇదే స్థాయిలోపారితోషకం అందుకోవాలంటే కెరీర్లో అతను మరో మెట్టు ఎదగాలి. ఇంకో రెండు హిట్లు పడాలి. అదే జరిగితే నిఖిల్.. నాని లీగ్‌లోకి వెళ్లిపోతాడు. 18 పేజెస్ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.