రష్మిక.. అక్కడ తుస్సుమనిపించింది

కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది రష్మిక మందన్నా. ఆ సినిమా చేయడానికి ముందు ఆమె ఒక మామూలు కాలేజీ అమ్మాయి. ఏదో ఒక యాడ్‌లో నటిస్తే దాన్ని ‘కిరిక్ పార్టీ’ దర్శకుడు రిషబ్ శెట్టి చూసి ఇంప్రెస్ అయి కథానాయికగా ఛాన్స్ ఇవ్వడం.. ఆ చిత్రం భారీ విజయన్నందుకుని కన్నడలో రష్మిక మంచి పేరు తెచ్చిపెట్టడం.. ఆ తర్వాత తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇస్తే అదీ సూపర్ హిట్ కావడం.. ఆపై ‘గీత గోవిందం’ బ్లాక్‌బస్టర్ అయి ఆమెను స్టార్ హీరోయిన్ని చేయడం.. చకచకా జరిగిపోయాయి.

తెలుగులో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్లలో నటించేసింది రష్మిక. తమిళంలో ఆమెకు కార్తి, విజయ్‌లతో జోడీ కట్టేసింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘వారిసు’తో తమిళంలో పెద్ద రేంజికి వెళ్లిపోతుందని రష్మిక మీద అంచనాలున్నాయి.

ఐతే సౌత్‌లో ఎంత ఆధిపత్యం చలాయించినా.. ఇక్కడి హీరోయిన్లు బాలీవుడ్లో జెండా ఎగురవేయడం కష్టమే. ఐతే ‘పుష్ప’ సినిమాతో రష్మికకు ఉత్తరాదిన మంచి క్రేజ్ రావడంతో బాలీవుడ్లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కాయి. తొలి సినిమాతోనే అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్‌తో నటించే అవకాశం దక్కించుకుంది రష్మిక. కానీ వీరి కలయికలో వచ్చిన ‘గుడ్ బై’ తుస్సుమనిపించింది. రష్మికకు ఈ సినిమా వల్ల ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.

ఇక రెండో చిత్రం ‘మిషన్ మజ్ను’తో అయినా రష్మికకు బ్రేక్ వస్తుందేమో అనుకుంటే.. ఆ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేశారు. సిద్దార్థ్ మల్హోత్రా లాంటి ఫాంలో ఉన్న హీరో సినిమా కావడంతో ఇది థియేటర్లలో రిలీజై హిట్టయితే రష్మిక బాలీవుడ్ కెరీర్‌కు ఊపు వస్తుందని అనుకున్నారు. కానీ ఆ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ కాబోతోంది. ఓటీటీల్లో విడుదలైన సినిమాల సక్సెస్‌ను లెక్కగట్టడం కష్టం. వాటి ఆధారంగా హీరోయిన్లకు అవకాశాలు దక్కడం కష్టం. ఈ సినిమా మిరాకిల్స్ సృష్టిస్తే తప్ప రష్మిక కెరీర్‌‌కు ఉపయోపడడం కష్టం. ఇక రష్మిక ఆశలన్నీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘యానిమల్’ మీదే.