ఇలాంటి టైంలో మైత్రికిది తలనొప్పే

నిన్న ఒక్కసారిగా మైత్రి ఆఫీస్ మీద ఐటి అధికారులు దాడి చేయడం ఇండస్ట్రీలోనే కాదు సినిమాల మీద ఆసక్తి ఉండే సగటు మూవీ లవర్స్ కి సైతం హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ల తాలూకు రిటర్న్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మాములు సమయంలో అయితే ఇదంతా మాములే అనుకోవచ్చు కానీ మైత్రి ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఒకవైపు వాల్తేరు వీరయ్య పాటల చిత్రీకరణ విదేశాల్లో జరుగుతోంది. మరోవైపు దాని తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ ని ఇంకో యూనిట్ ఆఘమేఘాల మీద పూర్తి చేసే పనిలో ఉంది. రెండు ఒకేసమయంలో అవ్వాల్సిందే.

ఇంకోపక్క వీరసింహారెడ్డి చివరి సాంగ్ షూట్ కోసం వచ్చే వారం హైదరాబాద్ లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో గుమ్మడికాయ కొట్టేస్తారు. దీనికీ ఒక టీమ్ నిర్మాణాంతర కార్యక్రమాల్లో తలమునకలై ఉంది. ఇటీవలే ఓపెన్ చేసిన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లో కార్యకలాపాలు పెరిగాయి. ముఖ్యంగా చిరు బాలయ్య సినిమాలకు సంబంధించిన బిజినెస్ ఎంక్వయిరీలు మాములుగా లేవు. పైగా థియేటర్ల వివాదం ఎలాగూ ఉండనే ఉంది. వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం, విద్యా వాసుల అహంకు ఎన్ని వస్తాయనే అంచనా స్పష్టంగా లేదు. దిల్ రాజు మాత్రం తన ప్లానింగ్ ని యధాతథంగా అమలుపరుస్తున్నారు.

పుష్ప 2 రెగ్యులర్ షూట్ మొదలైపోయింది. విజయ్ దేవరకొండ ఖుషి మీద పెట్టుబడుల భారం పెరుగుతోంది. సమంతా రాక గురించి క్లారిటీ లేకపోవడంతో షెడ్యూల్ ప్లానింగ్ కష్టంగా మారింది. చూస్తుంటే వచ్చే వేసవి కన్నా ముందు రిలీజ్ చేసే ఛాన్స్ తగ్గిపోతోంది. ఇన్నేసి వ్యవహారాలు ఏకకాలంలో జరుగుతుండగా ఆదాయపు పన్ను అధికారులకు వివరణ ఇవ్వాల్సి రావడం ఎంతైనా ఇబ్బంది కలిగించే పరిణామమే. అన్ని కరెక్ట్ గానే ఉండొచ్చు కానీ అవి ఋజువు చేయాలన్నా కొంత టైం పడుతుంది. ఉన్నట్టుండి ఇలా దాడులెందుకు జరిగాయన్న దాని మీద పరిశ్రమలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.