చిరు సార్.. దీని కోసం రంగంలోకి దిగాలి

చెప్పే వ్యక్తిని బట్టి విషయం విలువ మారిపోతుంది అని ‘అరవింద సమేత’లో ఓ డైలాగ్ ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇలా ఓ విషయాన్ని బలంగా చెప్పి ఇండస్ట్రీలోనే కాక సమాజంలోనూ ఆలోచన రేకెత్తించగల స్థాయి వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. రాజకీయాల వల్ల ఆయన ఇమేజ్ కొంచెం దెబ్బ తింది కానీ.. ఆ రంగాన్ని పూర్తిగా విడిచిపెట్టి, తిరిగి తనకెంతో ఇష్టమైన సినీ రంగంలోకి వచ్చేసిన చిరు.. తిరిగి అందరికీ ఆమోద యోగ్యమైన వ్యక్తిగా మారే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలతో పాటు అవగాహన పెంచేందుకు చేస్తున్న వీడియోలు కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. కరోనాపై జనాల్లో ఆలోచన రేకెత్తించేలా చిరు పలు రకాలుగా ప్రయత్నించారు. తాజాగా మాస్క్ ప్రాధాన్యాన్ని తెలియజెప్పే వీడియో చేశారు.

ఈ నేపథ్యంలో మరో ముఖ్యమైన ప్రచారంలో పాలు పంచుకోవాల్సిన అవసరాన్ని చాలామంది గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా చికిత్సలో ‘ప్లాస్మా’ ప్రాధాన్యం పెరిగింది. ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి రక్తాన్ని సేకరించి.. ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న పేషెంట్లకు చికిత్స చేస్తారన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో మొదలైన ఈ విధానాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రయత్నిస్తున్నారు వైద్యులు. కరోనా వల్ల పరిస్థితి విషమించిన రోగుల ప్రాణాలను ప్లాస్మా చికిత్సతోనే నిలబెడుతున్నారు. ఐతే ఇందుకు ఇప్పటికే కోలుకున్న రోగుల రక్తం చాలా అవసరం.

ఇది కూడా బ్లడ్ గ్రూప్ ఆధారంగానే అవసరమవుతుంది. దీని కోసం విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. కొందరు దీన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నంలోనూ ఉన్నారు. తన బ్లడ్ బ్యాంకు ద్వారా ఎన్నో లక్షల మందికి సాయపడ్డ వ్యక్తి చిరు. ఇప్పుడు ఆయన ప్లాస్మా దానంపై జనాల్లో అవగాహన పెంచి అవసరమైతే తన బ్లడ్ బ్యాంకు తరఫున సేకరణ చేపడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెలబ్రెటీలు కూడా దీనిపై అవగాహన పెంచి.. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసేలా ఆలోచన రేకెత్తించాల్సిన అవసరముంది.