మహేష్ పెద్ద మనసు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పుట్టెడు దు:ఖంలో ఉన్నాడు. ఈ ఏడాది ఆయనకు తగిలిన ఎదురు దెబ్బలు మామూలువి కాదు. పది నెలల వ్యవధిలో సోదరుడు రమేష్ బాబు.. తల్లిదండ్రులు ఇందిర, కృష్ణలను కోల్పోయాడు మహేష్. విధి తన మీద పగబట్టినట్లుగా ఇలా నెలల వ్యవధిలో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం మహేష్‌ను ఎంతగా బాధించి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రభావం తన కొత్త చిత్రం మీద పడుతుందని అందరూ అంచనా వేశారు.

ఇప్పటికే పలు కారణాల వల్ల ఆలస్యమైన ఈ చిత్రాన్ని డిసెంబరు రెండో వారంలో సెట్స్ మీదికి తీసుకెళ్లాలని ముందు అనుకున్నారు కానీ.. కృష్ణ మరణంతో షెడ్యూళ్లకు సంబంధించిన పనులను తాత్కాలికంగా ఆపేసింది చిత్ర బృందం. మహేష్‌ను కొన్ని రోజులు ఎవరూ కదిలించకూడదని, షూటింగ్ కోసం తనకు తానుగా అడిగే వరకు వేచి చూద్దామని.. అందుకు కొన్ని నెలల సమయం పట్టినా పర్వాలేదని త్రివిక్రమ్ అండ్ కో ఫిక్సయింది. కానీ మహేష్ పెద్ద మనసు చేసుకుని షూటింగ్‌కు రెడీ అవుతున్నట్లు సమాచారం.

ముందు అనుకున్న ప్రకారమే డిసెంబరు రెండో వారంలో షూట్ కోసం షెడ్యూల్ రెడీ చేసుకోవాలని దర్శక నిర్మాతలకు చెప్పేశాడట. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యం అయిన నేపథ్యంలో తన కోసం మళ్లీ వాయిదా వేయడం కరెక్ట్ కాదని అతను భావించాడట.

ఇటీవల కృష్ణకు నివాళి అర్పిస్తూ మహేష్ పెట్టిన ఒక పోస్టులో కేవలం తన బాధను వ్యక్తం చేయడానికి పరిమితం కాకుండా.. ఇప్పుడు తాను మరింత బలంగా ఉన్నట్లు అనిపిస్తోందని, అది మీరిచ్చిన ధైర్యమే అని కృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు మహేష్. తండ్రి మరణంతో శోకంలో మునిగిపోకుండా, కుంగిపోకుండా.. ధైర్యంగా నిలబడాలని మహేష్ ఫిక్సయినట్లు స్పష్టమవుతోంది. కృష్ణ అన్నీ చూసి, ప్రశాంతంగా కన్ను మూశారు కాబట్టి ఆయన మరణంతో కుంగిపోవడం కరెక్ట్ కాదని, మామూలు జీవనంలోకి వచ్చేయాలని, సాధ్యమైనంత త్వరగా షూట్‌లోకి వెళ్లాలని మహేష్ ఫిక్స్ అయి త్రివిక్రమ్ అండ్ టీంకు క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది.