విజయ్‌నీ వదలని ఈడీ

పూరి జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ సినిమా చేయడానికి రెడీ అయినపుడు.. అభిమానుల్లో అంత సానుకూల స్పందనేమీ కనిపించలేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి ప్లూక్ హిట్‌ను చూసి పూరితో జత కట్టేస్తున్నాడని.. గత పదేళ్లలో పూరి ట్రాక్ రికార్డును బట్టి చూస్తే విజయ్‌కి ఎదురు దెబ్బ తగలడం గ్యారెంటీ అని వాళ్లు భయపడ్డారు. కానీ ‘లైగర్’కి ఎలాగోలా మంచి హైప్ అయితే తీసుకురాగలిగారు విజయ్ అండ్ పూరి. దీంతో అంతకుముందు ఈ సినిమాను వ్యతిరేకించిన వాళ్లు కూడా విజయ్, పూరి, ఛార్మి చెప్పిన మాటలకు బోల్తా కొట్టేశారు. బాక్సాఫీస్ దగ్గర ఏదో మ్యాజిక్ జరిగిపోతుందని ఆశించారు. తీరా చూస్తే తన కెరీర్లోనే అత్యంత పేలవ అనదగ్గ సినిమాను అందించాడు పూరి.

విజయ్‌కైతే ఈ సినిమా తన కెరీర్లోనే ఒక పెద్ద మచ్చలా మిగిలిపోయింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మీడియాకు ముఖం చూపించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడంటే.. ‘లైగర్’ అతడికి ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఐతే మీడియాను తప్పించుకోగలగుతున్నాడు కానీ.. ఈ సినిమా పెట్టుబడులపై తవ్వకాలు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల నుంచి మాత్రం విజయ్ తప్పించుకోలేకపోయాడు. ‘లైగర్’ పెట్టుబడుల్లో బ్లాక్‌మనీ ఉందని.. కొందరు రాజకీయ నేతలు, బడా బాబులు ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేశారనే అనుమానంతం కొన్ని రోజులుగా ఈడీ అధికారులు ఈ టీంలో ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను ఈడీ అధికారులు విచారించడం తెలిసిందే.

ఆర్థిక లావాదేవీలన్నీ చేసింది ఆ ఇద్దరే కాబట్టి వారిని విచారించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ విజయ్‌ని సైతం ఇదే విషయమై ప్రశ్నిస్తుండడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పూరి, ఛార్మిలతో క్లోజ్‌గా ఉన్నాడు, ఇంటర్వ్యూల్లో ఫినాన్షియల్ విషయాల గురించి మాట్లాడాడు కాబట్టి విజయ్‌ని కూడా విచారిస్తుండొచ్చు. మొత్తానికి ‘లైగర్’ తలనొప్పులు ఆ చిత్ర బృందాన్ని ఇప్పట్లో అయితే వదిలేలా లేవు.