మాకు లేని బాధ వేరే వాళ్లకు ఎందుకు?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పేరు ఈ మధ్య ఒక వివాదంలో తెగ నానుతోంది. ఆయన నిర్మాణంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘వారిసు’ తెలుగు అనువాదానికి ఎక్కువ థియేటర్లు అట్టి పెడుతున్నాడంటూ రాజు ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పండుగలప్పుడు తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఉండాలని, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కష్టమని గతంలో వ్యాఖ్యానించి ఇప్పుడు అందుకు భిన్నంగా రాజు వ్యవహరిస్తున్నాడంటూ ఆయన తీరును తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కొన్ని రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది.

నిర్మాతల మండలి సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, మరోవైపు ‘వారసుడు’కు సరిపడా థియేటర్లు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని తమిళ దర్శక నిర్మాత లింగుస్వామి హెచ్చరించడం వివాదం ముదిరింది. ఐతే ఇప్పటిదాకా ఈ విషయమై మౌనం వహించిన రాజు.. ఎట్టకేలకు స్పందించాడు.

‘వారసుడు’ థియేటర్ల కేటాయింపు విషయంలో అసలు వివాదమే లేదని ఆయన తేల్చేశాడు. సంక్రాంతికి రాబోతున్న మిగతా రెండు చిత్రాలు ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో తనకు మంచి అండర్‌స్టాండింగ్ ఉందని, వాళ్లకు లేని ఇబ్బంది బయటికి వారికి ఎందుకని ఆయన ప్రశ్నించాడు.

“మేం మా వారసుడు సినిమాకు సంక్రాంతి రిలీజ్ డేట్‌ను మేలోనే అనౌన్స్ చేశాం. చిరంజీవి గారి చిత్రం రిలీజ్ డేట్ జూన్‌లో ప్రకటించారు. బాలకృష్ణ గారి సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించింది అక్టోబరులో. సంక్రాంతికి ఆదిపురుష్ సినిమా కూడా వచ్చేట్లయితే థియేటర్ల విషయంలో ఇబ్బంది అయ్యేది. కానీ ఆ చిత్రం వాయిదా పడింది కాబట్టి సమస్య లేదు. తెలుగు రాష్ట్రాల్లో మూడు సినిమాలకు సరిపడా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారితో నేను థియేటర్ల గురించి ఎప్పుడో మాట్లాడాను. మా మధ్య మంచి సమన్వయం ఉంది. వాళ్లకు లేని సమస్య మిగతా వాళ్లకు ఎందుకో అర్థం కావడం లేదు” అని దిల్ రాజు పేర్కొన్నాడు.