పక్కా ప్లానింగ్ తో అఖండ 2

గత ఏడాది డిసెంబర్ లో విడుదలై బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన అఖండ సీక్వెల్ కు రంగం సిద్ధమవుతోంది. గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో ఈ ప్రస్తావన మీడియా తెచ్చినప్పటికీ దాని గురించి వివరాలు ఎక్కువ వెల్లడించకపోయినా బాలకృష్ణ పక్కనే ఉన్న బోయపాటి శీను మాత్రం తప్పకుండ చేస్తామనే హామీ అయితే ఇచ్చేశారు. దానికి అనుగుణంగానే పక్కా ప్లాన్ తో స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. ప్రస్తుతం వీరసింహారెడ్డి పూర్తి చేసి విడుదల కాగానే అనిల్ రావిపూడి రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.

2023 వేసవిలోగా కంప్లీట్ చేసి ఆ తర్వాత రెండు బాధ్యతలు బాలయ్య భుజాల మీద ఉంటాయి. ఒకటి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ. ఆదిత్య 999 ద్వారా లాంచ్ చేస్తారనే టాక్ ఉంది కానీ అదంత త్వరగా తెరకెక్కేలా లేదు. పైగా స్వీయ దర్శకత్వం కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా బాలకృష్ణ పూర్తిగా దీని మీద కాన్సన్ ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నాన్న ఎన్టీఆర్ తాతమ్మ కలతో తన సినిమాలోనే పరిచయం చేసిన సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని బాలయ్య చూస్తున్నారు. అలాంటప్పుడు ఆదిత్య 999 కంటే మంచి ఆప్షన్ ఉండదు. పైకి వచ్చే ఏడాది అంటున్నారు కానీ 2024 అవ్వొచ్చు.

అటువైపు బోయపాటి శీను రామ్ సినిమా పూర్తి చేసి ఫ్రీ అయ్యేలోగా సమ్మర్ వచ్చేస్తుంది. ఆపై రెండు మూడు నెలలకు బాలయ్య అందుబాటులోకి వస్తారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణంలో అఖండ 2 రూపొందుతుందని ఆల్రెడీ లీక్ వచ్చేసింది. అఖండకు కొనసాగింపే అయినా ఈసారి పొలిటికల్ టచ్ ఇస్తారని సమాచారం. లెజెండ్ క్లైమాక్స్ లో పలు రాజకీయ సంభాషణలు వ్యంగ్యాస్త్రాలు బలంగా వాడిన బోయపాటి రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అంతకు మించిన మసాలానే ఇస్తారట. ఏదైతేనేం బాలయ్య కెరీర్ లో మొదటి సీక్వెల్ కి రంగం సిద్ధమవుతోంది.