ఎక్కువ క్రెడిట్ రావడంపై శేష్ సమాధానం

అడివి శేష్.. ఇప్పుడు టాలీవుడ్లో ఈ పేరు ఒక బ్రాండ్. ఆ పేరు చూసి భరోసాతో థియేటర్లకు వెళ్తున్న ప్రేక్షకుల సంఖ్య పెద్దదే. కెరీర్ ఆరంభంలో కర్మ, కిస్ లాంటి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న అతను.. ఆ తర్వాత కొంత కాలం నటనకు పరిమితం అయ్యాడు. ఆపై ‘క్షణం’ నుంచి జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ..వాటి రచనలో పాలుపంచుకుంటూ నిలకడగా విజయాలు సాధిస్తూ సాగిపోతున్నాడు.

ఈ ఏడాది ఇప్పటికే ‘మేజర్’తో కెరీర్లో మేజర్ హిట్ కొట్టిన శేష్.. ఇప్పుడు ‘హిట్-2’ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద హిట్టవడం గ్యారెంటీ అనే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాల సంగతి పక్కన పెడితే.. శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన సినిమాలకు సంబంధించి సక్సెస్ క్రెడిట్ చాలా వరకు అతడికే వెళ్లింది. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్.. ఈ సినిమాలన్నింటికీ దర్శకులు వేరే వాళ్లు అయినా.. వారితో పోలిస్తే శేష్‌కే ఎక్కువ క్రెడిట్ వెళ్లింది.

కేవలం నటుడిగా మాత్రమే శేష్‌‌కు పేరొస్తే అది వేరే విషయం. కానీ ఆ సినిమాలు అంత బాగా తెరకెక్కాయంటే అందుక్కారణం శేషే అని అందరూ నమ్ముతున్నారు. ఈ చిత్రాల దర్శకులకు దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదనే అభిప్రాయాలున్నాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో శేష్ స్పందించాడు. “ఈ సినిమాల్లో చాలా వరకు రైటింగ్‌లో నా హ్యాండ్ ఉంది. కొన్ని సినిమాలకు పూర్తిగా నేనే రాశాను. కొన్ని చిత్రాలకు కొంత మేర రైటింగ్‌లో నా ప్రమేయం ఉంది. ‘ఎవరు’ సినిమాలో రచయితగా నా పేరు వేసుకోలేదు కానీ.. అందులో కూడా కొంత మేర నా రాత ఉంది. నేను కేవలం రచయితను అయితే ఈ పేరు వచ్చేది కాదేమో. నేను హీరో కావడంతో ఆ ఫేమ్ కలిసొచ్చింది. అందువల్ల రచయితగా నాకు ఎక్కువ పేరు వచ్చింది. నిజానికి తెలుగులో రచన, దర్శకత్వం వేరు వేరుగా ఉండనివ్వరు. రెండూ ఒకరే చేయాలనుకుంటారు. హాలీవుడ్లో అలా ఉండదు. స్పీల్‌బర్గ్‌ను చూడండి. ఆయన కెరీర్ మొత్తంలో ఒకటో రెండో సినిమాలకు మాత్రమే స్క్రిప్టు రాసి ఉంటాడేమో. మన దగ్గర దానికి భిన్నంగా జరుగుతుంటుంది” అని శేష్ వివరించాడు.