అల్లరోడు తన జానర్లోకి వెళ్లాల్సిందే

అల్లరి నరేష్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. టాలీవుడ్లో అసలేమాత్రం నెగెటివిటీ లేకుండా, అందరు స్టార్ హీరోల అభిమానులూ ఇష్టపడే కథానాయకుల్లో అతనొకడని చెప్పాలి. ప్రేక్షకులకు అతడి మీద అంత ప్రత్యేకమైన అభిమానం ఏర్పడడానికి కారణం.. అతను ఒక టైంలో తన సినిమాలతో తిరుగులేని వినోదాన్ని అందించడమే.

‘అల్లరి’ మొదలుకుని ‘సుడిగాడు’ వరకు అతను ప్రేక్షకులను మామూలుగా నవ్వించలేదు. విరామం లేకుండా కామెడీ సినిమాలు చేసి ప్రేక్షకులకు థియేటర్లలో మంచి రిలీఫ్ ఇచ్చాడు. ఐతే ‘సుడిగాడు’లో నరేష్ ఓవర్ డోస్ పేరడీ, స్పూఫ్ ఎంటర్టన్మెంట్ ఇచ్చేయడంతో ఆ తర్వాత అతను చేసిన కామెడీ సినిమాలేవీ వర్కవుట్ కాలేదు. జానర్ మార్చినా ఫలితం లేకపోయింది. చివరికి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ‘నాంది’ అనే సీరియస్ మూవీ చేశాడు. ఆ సినిమాకు మంచి ఫలితం వచ్చింది.

‘నాంది’ సినిమాలో కథ చాలా బలంగా ఉంటుంది. అందులో సర్ప్రైజింగ్‌ ఎలిమెంట్స్ ఉంటాయి. నరేష్ కామెడీ వదిలేసి సీరియస్ మూవీ చేయడం వల్లే అది బాగా ఆడిందనుకుంటే పొరబాటే. నరేష్ మాత్రం ఇలాగే ఫీలైనట్లున్నాడు. మళ్లీ అతను ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రూపంలో మరో సీరియస్ మూవీ చేశాడు. ఈ రోజుల్లో సీరియస్ సినిమాలు అసలేమాత్రం వర్కవుట్ కావడం లేదు. ఎంటర్టైనర్లే కోరుకుంటున్నారు. అలా అని నరేష్ గతంలో చేసిన టైపులోనే కామెడీ సినిమాలు చేస్తే వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. కామెడీలోనూ ఇంకేదైనా కొత్తగా చెయ్యాలి.

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’లో కొంచెం కామెడీ డోస్ ఉన్నా అది ఏమాత్రం సరిపోలేదు. ఇంత సీరియస్ మూవీ ఏం చూస్తాం అన్నట్లు తొలి రోజు థియేటర్ల వైపు ప్రేక్షకులు పెద్దగా చూడలేదు. మార్నింగ్ షోల నుంచే డల్లుగా మొదలైన సినిమా.. మిక్స్డ్ రివ్యూల వల్ల పుంజుకోలేకపోయింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, రఘుబాబు లాంటి వాళ్లు కొంచెం ఎంటర్టైన్ చేశారు కానీ.. నరేష్ అయితే మరీ సీరియస్‌గా కనిపించాడు. ఎంత ‘నాంది’ ఆడితే మాత్రం నరేష్ మరీ ఇంత సీరియస్ క్యారెక్టర్లు, సినిమాలు చేయాలా అని అతడి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కామెడీలోనే కొంచెం కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తే అల్లరోడు మంచి ఫలితాన్ని అందుకోగలడని వారు అభిప్రాయపడుతున్నారు.