అన్నపూర్ణలో అడివి వారి పాన్ ఇండియా సినిమా

కెరీర్ ఆరంభంలో నటుడిగా, దర్శకుడిగా గట్టి ఎదురు దెబ్బలే తిన్నాడు అడివి శేష్. కానీ ‘క్షణం’ దగ్గర్నుంచి అతడి రాత మారిపోయింది. రైటర్‌గా, ఫిలిం మేకర్‌గా తనకు ఒక పరిధిని నిర్దేశించుకుని, అభిరుచి ఉన్న.. తనతో సింక్ అయ్యే ప్రతిభావంతులైన దర్శకులను ఎంచుకుని చక్కటి థ్రిల్లర్ సినిమాలు చేస్తూ అతను ముందుకు సాగుతున్నాడు. గూఢచారి, ఎవరు, మేజర్ లాంటి సినిమాలు అతడి ఇమేజ్‌, ఫాలోయింగ్‌ను ఎంతగానో విస్తరించాయి.

ఇప్పుడు శేష్ నుంచి రాబోతున్న ‘హిట్-2’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రోజే రిలీజైన ‘హిట్-2’ ట్రైలర్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా శేష్ ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో తాను ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఇంతకుముందు ఇదే బేనర్లో శేష్ ‘గూఢచారి’ సినిమా చేశాడు. అది సూపర్ హిట్టయింది.

ఈసారి పాన్ ఇండియా లెవెల్లో మల్టీ లాంగ్వేజ్ మూవీ చేయనున్నాడట శేష్ అన్నపూర్ణ వారి బేనర్లో. ఇదొక యాక్షన్ టచ్ ఉన్న లవ్ స్టోరీ అని కూడా అతను వెల్లడించాడు. ఐతే ఈ చిత్రానికి దర్శకుడెవరు, ఇతర వివరాలేంటి అన్నది వెల్లడించలేదు. మరోవైపు ‘హిట్-2’ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఆలోచన కూడా ఉన్నట్లు శేష్ తెలిపాడు.

ముందు ఈ చిత్రాన్ని తెలుగు వరకే అనుకుని చేశామని.. కానీ హిట్-2 ప్రోమోలకు హిందీ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఆశ్చర్యం కలిగిస్తోందని.. ముందు డిసెంబరు 2న తెలుగులో రిలీజ్ చేసి, ఆ తర్వాత హిందీ సహా పలు భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తామని శేష్ తెలిపాడు. అంతే కాక ‘హిట్-3’ కూడా పక్కాగా ఉంటుందని, అందులో తాను నటిస్తానని.. ఇంకా ఎవరెవరు ఆ చిత్రంలో ఉంటారన్నది తర్వాత చెబుతామని శేష్ చెప్పాడు. హిట్-3లో నాని, విజయ్ సేతుపతి కూడా నటిస్తారని, ఇది అమెరికా నేపథ్యంలో సాగుతుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.