DSP మీద మాస్ ట్రోలింగ్

ఈ మధ్య సోషల్ మీడియా యాక్టివ్ నెస్ మాములుగా లేదు. ఏదైనా సినిమా తాలూకు అప్ డేట్ వస్తే చాలు దాని తాలూకు పోస్ట్ మార్టం ఓ రేంజ్ లో జరిగిపోతోంది. వాల్తేర్ వీరయ్య నుంచి కేవలం కొన్ని సెకండ్ల ప్రోమో వదలగానే విపరీతమైన ట్రోలింగ్ మొదలయ్యింది. నిజానికా వీడియోలో ఎలాంటి పల్లవి కానీ చరణం కానీ లేవు. కేవలం బాస్ వస్తున్నాడు గెట్ రెడీ అంటూ డిఎస్పి వేగంగా చెప్పే రెండు మూడు లైన్లు తప్ప ఇంకేం లేవు. దాన్నే అసలు పాటగా భావించిన మీమర్స్ ఉదయం నుంచి రెచ్చిపోతున్నారు. సాంగ్ ఇలా ఉందేంటని రకరకాల వ్యంగ్య వీడియోలతో విరుచుకుపడుతున్నారు. కొన్ని మరీ టూ మచ్ గా ఉన్నాయి.

ఇవి కాస్తా వైరల్ కావడంతో ఒకరిని చూసి మరొకరు వాళ్ళ వాళ్ళ స్వంత క్రియేటివిటీ చూపించడం మొదలుపెట్టారు. దేవి కొంత కాలంగా ఫామ్ లో లేకపోవడమే ఇలా టార్గెట్ అవ్వడానికి ప్రధాన కారణం. వాల్తేర్ వీరయ్యకు సైతం మంచి ట్యూన్స్ ఇచ్చాడో లేదోననే లేనిపోని అనుమానంతో ఇటు చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు ఇతర స్టార్ల అభిమానులూ దాడి మొదలుపెట్టారు. ఇదంతా జరుగుతుండగానే చిరంజీవి నుంచి ఈ పాటకు సంబంధించి ఎవరెవరైతే పని చేశారో వాళ్లందరికీ ప్రత్యేకంగా ప్రశంసలు చెబుతూ ఒక ట్వీట్ రావడం గమనార్హం. ఆయన ఏ ఉద్దేశంతో పెట్టినా అంచనాలైతే పెంచారు.

ఇది కాసేపు పక్కనపెడితే దేవిశ్రీ ప్రసాద్ మీద నిజంగా చాలా ఒత్తిడి ఉంది. ఒకవైపు వీరయ్యకు అపోజిషన్ గా ఉన్న వీరసింహారెడ్డికి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అఖండను మించిన అవుట్ ఫుట్ ని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ వాళ్ళ తమన్ అంచనాలను నిజం చేస్తే దానికి ధీటుగా దేవి ట్యూన్స్ ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్న తరహాలో బాస్ పార్టీ పాట ఎలా ఉంటుందనే దాన్ని బట్టి మిగిలిన సాంగ్స్ మీద ఒక అవగాహనకు రావొచ్చు. మైత్రి బ్యానర్ కు ఎప్పుడూ నిరాశ పరచని ఆల్బమ్ ఇవ్వని దేవి మరి వాల్తేర్ కు ఏం చేశాడో చూడాలి.