దిల్ రాజు సేఫ్ అయినట్లేనా?

సంక్రాంతికి తెలుగు సినిమాలు పోటీలో ఉండగా తమిళ చిత్రాలకు ఎలా థియేటర్లు ఇస్తామంటూ గతంలో ప్రశ్నించి.. ఇప్పుడేమో తన నిర్మాణంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ డబ్బింగ్ వెర్షన్‌కు పెద్ద ఎత్తున థియేటర్లు బుక్ చేస్తుండడంపై కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. దీని వల్ల సంక్రాంతికే రానున్న చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య మూవీ ‘వీరసింహారెడ్డి’లకు థియేటర్లు సమస్య తలెత్తేలా ఉండడంతో ఆ హీరోల అభిమానులు రాజును టార్గెట్ చేసుకున్నారు.

ఈ రెండు చిత్రాలనూ నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఎవ్వరూ కూడా ఈ విషయమై ఓపెన్‌గా మాట్లాడింది లేదు. కానీ అభిమానులతో పాటు నిర్మాతల మండలిని కూడా దిల్ రాజు మీదికి ఉసిగొల్పుతున్నారనే చర్చ నడిచింది టాలీవుడ్లో. కాగా గత కొన్ని రోజుల్లో పరిణామాలు కొంత మేర దిల్ రాజుకు అనుకూలంగా మారాయి.

‘వారసుడు’కు థియేటర్లు ఇవ్వకపోతే తెలుగు సినిమాలకు తమిళనాట ఇబ్బందులు తప్పవన్నట్లుగా లింగుస్వామి సహా అక్కడి ఇండస్ట్రీ జనాలు హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. ఈ వాదన మరీ విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే తమిళంలో తెలుగు చిత్రాలకు మార్కెట్ పెరుగుతుండడం.. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా సినిమాలు చాలానే తమిళనాట రిలీజ్ కావాల్సి ఉండడంతో ప్రాంతీయ అభిమానం కొంచెం ఎక్కువైన కోలీవుడ్ జనాలతో కొంచెం ఆచితూచి వ్యవహరించక తప్పదు.

ఇంకోవైపు మరో టాప్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్.. దిల్ రాజుకు మద్దతుగా మాట్లాడాడు. మైత్రీ వాళ్లు ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తే తప్పు లేనిది.. ఒక తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడు కలిసి చేసిన సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయకూడదా అని ఆయన ప్రశ్నించారు. తన ప్రొడక్షన్లో సినిమాలు చాలా వరకు పాన్ ఇండియా స్థాయిలోనే రిలీజవుతుండడంతో దత్ కోలీవుడ్‌తో కయ్యానికి ఇష్టపడట్లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో నిర్మాతల మండలి తరఫున ప్రసన్న కుమార్ కూడా స్పందించాడు. తమ ప్రకటన విషయంలో ఆయన ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు. మనం బతకాలి, వేరే వాళ్లను బతకనివ్వాలి అనే మాట మాట్లాడుతున్నారు. డబ్బింగ్ సినిమాలను ఆపాలన్నది తన ఉద్దేశం కాదంటున్నారు. మొత్తానికి ఇటీవలి పరిణామాలతో రాజు కొంచెం సేఫ్ అయి సాఫీగానే తన సినిమాను రిలీజ్ చేసుకునేలా కనిపిస్తున్నారు. ఎటొచ్చీ ఇప్పుడు మైత్రీ వారికే ఇబ్బందులు తప్పేలా లేవు.