హైదరాబాద్ సినీ ప్రేమికులకు లార్జ్ కానుక

నెల్లూరు దగ్గర సూళ్లూరుపేటలో వి సెల్యులాయిడ్ ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ పెట్టాక అసలు హైదరాబాద్ లో ఇలాంటిది లేదేనన్న మూవీ లవర్స్ కొరత మరికొద్ది రోజుల్లోనే తీరనుంది. ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఉన్న లార్జ్ స్క్రీన్ ని కొంత కాలం క్రితం రీ మోడలింగ్ కోసం మూసేశారు. ఇప్పుడు అది కొత్త రూపం సంతరించుకుంది. 64 అడుగుల ఎత్తు 101.6 అడుగుల వైశాల్యంతో ఇండియాలోనే అతి భారీ, ప్రపంచంలోనే అత్యంత పొడవైన వెండితెరగా కొత్త ఘనతను సాధించనుంది. ఒకప్పుడు ఐమాక్స్ స్క్రీనింగ్ తో అలరించిన ఈ థియేటర్ లో చాలా ఏళ్ళుగా ఆ ప్రొజెక్షన్ అందుబాటులో లేదు.

ఇప్పుడు కూడా ఒరిజినల్ ఐమ్యాక్స్ టెక్నాలజీని వాడకపోయినా దాన్ని మించే స్థాయిలో కెనడా నుంచి తెప్పించిన వరల్డ్ క్లాస్ త్రీడి ప్రొజెక్టర్ ని దీని కోసం సెట్ చేశారు. అంటే భాగ్యనగర వాసులకు దీని ద్వారా సరికొత్త అనుభూతిని పొందవచ్చు. ముఖ్యంగా అవతార్ 2 బ్యాక్ టు ది వాటర్ ని ఇందులో చూడటం నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మరమత్తు పనులను చూసినవాళ్లు అంటున్నారు. అయితే తెలుగు సినిమాలన్నీ ఒకే తరహా అనుభూతినివ్వకపోవచ్చు కానీ హాలీవుడ్ మూవీస్ ని మాత్రం ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయొచ్చు. ఆర్ఆర్ఆర్ లాంటివి రీ రిలీజ్ చేస్తే అదిరిపోతుంది.

ప్రేక్షకుల డిమాండ్ కు తగ్గట్టు ఇలాంటి మార్పులకు యాజమాన్యాలు పూనుకోవడం శుభ పరిమాణం. మల్టీప్లెక్సుల సంస్కృతి వచ్చాక స్క్రీన్లు మరీ చిన్నగా మారిపోతున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎక్కువ స్క్రీన్లు ఉంచాలనే ఉద్దేశంతో మరీ హోమ్ థియేటర్ సైజులో నడుపుతున్నవి లేకపోలేదు. వంద ఇంచుల స్మార్ట్ టీవీలు మాములు విషయంగా మారిపోతున్న ట్రెండ్ లో వెండితెర సాధ్యమైనంత పెద్దదే ఉండాలి. అప్పుడే చూసే ఆడియన్స్ కి కిక్ ఉంటుంది. సౌండ్ ఎంత బాగున్నా తెర చిన్నగా ఉంటే మజా ఎక్కడిది. సో హైదరాబాదీలు ఇకపై లార్జ్ ఎంటర్ టైన్మెంట్ ఎంజాయ్ చేయొచ్చు.