కృష్ణ అంత్యక్రియలు అక్కడే ఎందుకంటే?

ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన మరణంతో లక్షల మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. టాలీవుడ్‌లోనూ విషాదం అలుముకుంది. వివాద రహితుడిగా పేరున్న కృష్ణకు సంబంధించి అంత్యక్రియల విషయంలో చిన్న వివాదం నడిచింది.

కృష్ణ కుటుంబాలకు హైదరాబాద్ నగర శివార్లో పెద్ద ఎత్తున పొలాలు, ఫామ్‌ హౌస్ ఉండగా.. అక్కడ కాకుండా అందరికీ అంత్యక్రియలు చేసే మహాప్రస్థానంను ఎంచుకోవడంపై కొంత విమర్శలు ఎదురయ్యాయి. సొంత స్థలంలో అంత్యక్రియలు చేసి, సమాధి నిర్మించి మెమోరియల్ ఏర్పాటు చేస్తే బాగుండేదన్న అభిప్రాయాలను కొందరు వ్యక్తం చేశారు.

ఈ విషయంలో కృష్ణ కుటుంబీకుల్లో ఏకాభిప్రాయం లేదని.. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు అభీష్టానికి భిన్నంగా మహా ప్రస్థానంలో అంత్యక్రియలు చేశారని కొందరు ఊహాగానాలు పుట్టించారు. ఐతే ఈ విషయమై స్వయంగా ఆదిశేషగిరి రావు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

‘‘మా కుటుంబ సభ్యులు అందరం కలిసి కూర్చుని అంత్యక్రియల విషయంలో నిర్ణయం తీసుకున్నాం. ఇందులో వివాదానికి తావు లేదు. మొదట మహేశ్వరంలోని పద్మాలయా స్టూడియోలో అంత్యక్రియలు చేయాలనుకున్నాం. కానీ దూరం అవుతుందని వెనక్కి తగ్గాం. మా ఫాం హౌస్‌లో చేయాలనే ఆలోచన కూడా వచ్చింది. జనం ఎవ్వరినీ రానివ్వకుండా ఎక్కడో దూరంగా అనాథలా చేయడం మాకు ఇష్టం లేదు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిపినా మెమోరియల్ ఏర్పటు చేసి సమాధి కడతాం. విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం. కృష్ణగారు చనిపోయిన రోజు అభిమానుల సందర్శన కోసం గచ్చిబౌలీ స్టేడియంలో పార్థిక దేహాన్ని ఉంచాలని అనుకున్నాం. కానీ విపరీతంగా మంచు పడుతుండడంతో అందరికీ ఇబ్బంది అవుతుందని మా పద్మాలయా ఆఫీసులోనే ఉంచాం’’ అని ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ ఉన్న ఇంటిని మెమోరియల్‌గా మారుస్తారా అని అడిగితే.. ‘‘అన్నయ్య ఉన్నంత వరకు ఆయనదే ఆ ఇల్లు. ఆయన తదనంతరం అది నరేష్‌కు చెందుతుంది. మెమోరియల్ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది తర్వాత నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయనన్నారు.