రీమేక్ సినిమాకు అర్ధరాత్రి షోలు

ఏదైనా బ్లాక్ బస్టర్ సినిమా వేరే భాషలో రీమేక్ అవుతుంటే దాని ఒరిజినల్ వెర్షన్ ఏ ఓటిటిలో దొరుకుతుందో వెతికి మరీ చూసే కాలంలో ఉన్నాం మనం. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం కష్టమైనా సరే సబ్ టైటిల్స్ సహాయంతో చూసే వాళ్ళు కోట్లలో ఉన్నారు.

అలాంటిది ఎప్పుడో ఏడాది క్రితం వచ్చిన హిట్ మూవీకి ఇప్పుడు రీమేక్ థియేటర్లలో వస్తే దానికి స్పందన ఎలా ఉంటుంది. అందులోనూ అసలే గడ్డు స్థితిలో ఉన్న బాలీవుడ్ లో అయితే ఊహించుకోవడమూ కష్టమే. కానీ అజయ్ దేవగన్ సుడి బాగుంది. నిన్న రిలీజైన దృశ్యం 2కి నార్త్ ఆడియన్స్ నుంచి ఫస్ట్ క్లాస్ మార్కులు పడ్డట్టు ట్రేడ్ రిపోర్ట్.

అలా అని ఆషామాషీగా కాదు. పబ్లిక్ డిమాండ్ మేరకు నిన్న కొన్ని మల్టీ ప్లెక్సుల్లో అర్ధరాత్రికి స్పెషల్ షోలు వేసేంత. ముంబై పివిఆర్ ఐకాన్ గుర్గావ్ లో రిలీజైన రోజు లేట్ నైట్ ఒంటి గంటకు షోలు వేయడం చాలా అరుదు.

బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివకు మాత్రమే ఇలా జరిగింది. రివ్యూలు పాజిటివ్ గా రావడంతో పాటు ప్రేక్షకుల స్పందన బాగుండటంతో సెకండ్ షోల కల్లా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. ఇదంతా ఎలా ఉన్నా ఆల్రెడీ వెంకటేష్ దృశ్యం 2ని అమెజాన్ ప్రైమ్ లో చూసేసిన మనకు ఇప్పుడీ అజయ్ దేవగన్ సీక్వెల్ అంతగా కిక్ ఇవ్వదు. కేవలం క్యాస్టింగ్ లో మార్పు తప్ప అంతా సేమే.

హిందీ దృశ్యం 2కి పెద్ద ప్లస్ పాయింట్ నిడివి. కేవలం రెండు గంటల పన్నెండు నిమిషాలకే దర్శకుడు అభిషేక్ పాఠక్ లాక్ చేయడం బోర్ ని తగ్గించేసింది. మళయాలంలో ఇది మూడు గంటకు దగ్గరగా ఉండగా వెంకీ వెర్షన్ లో పదిహేను నిముషాలు కోత వేశారు.

క్లైమాక్స్ లో చిన్న మార్పుతో పాటు సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేకి చేసిన చేంజెస్ వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ నేపధ్య సంగీతానికి ప్రశంసలు దక్కుతున్నాయి. టబు, శ్రేయలతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అక్షయ్ ఖన్నా యాక్షన్ దన్నుగా నిలిచాయి. చూస్తుంటే దృశ్యం 3కి రూట్ క్లియర్ అయినట్టే ఉంది