నితిన్‌ను వెంటాడుతున్న ఫెయిల్యూర్ భయం

టాలీవుడ్ యువ కథానాయకులు చాలామంది పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఒక హిట్టు పడితే.. మూడు ఫ్లాపులు అన్నట్లుంది వాళ్ల సిచువేషన్. నితిన్ సైతం ఇలాంటి స్థితిలోనే ఉన్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత ‘భీష్మ’ అతడికి కొంచెం ఉపశమనాన్ని అందించింది.

ఆ ఊపులో చకచకా సినిమాలు ఒప్పేసుకున్నాడు. అవన్నీ ప్రామిసింగ్‌గానే కనిపించాయి. కానీ తీరా తెరపై బొమ్మ పడ్డాక కథ అడ్డం తిరిగింది. చెక్, రంగ్‌దె తుస్సుమనిపించాయి. ఓటీటీలో రిలీజైన ‘మ్యాస్ట్రో’ పెద్దగా సౌండ్ చేయలేకపోయింది. ఇలాంటి టైంలో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా మీదే నితిన్ ఆశలన్నీ నిలిచాయి. ఐతే ప్రోమోల్లో ప్రామిసింగ్‌గా కనిపించిన ఈ మాస్ మసాలా మూవీ.. నితిన్ గత చిత్రాలను మించిన పరాజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడంతో నితిన్ కెరీర్ ప్రమాదంలో పడిపోయింది.

ఇంకో ఫ్లాప్ పడితే తట్టుకునే స్థితిలో నితిన్ లేడు. అందుకే కొత్త సినిమా విషయంలో అతను మీనమేషాలు లెక్కిస్తున్నాడు. ఆల్రెడీ బడ్జెట్ భయాలతో ‘పవర్ పేట’ను అతను పక్కన పెట్టేశాడు. ‘మాచర్ల’ సెట్స్ మీద ఉండగానే అతను రైటర్ టర్న్డ్ డైరెక్టర్ వక్కంతం వంశీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన స్వీయ నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించడానికి కూడా ముందుకు వచ్చాడు. కానీ ప్రాజెక్టు ఓకే అయింది కానీ.. ఎంతకీ ఇది సెట్స్ మీదికి మాత్రం వెళ్లట్లేదు.

ముందు లైన్ చెప్పినపుడు ఈజీగానే ఓకే చెప్పేశాడు కానీ.. ‘మాచర్ల’ డిజాస్టర్ అయి, తన కెరీర్ ప్రమాదకర స్థితికి చేరేసరికి నితిన్‌లో భయం పట్టుకుంది. ఫుల్ స్క్రిప్టు ఎంతకీ ఓకే అవ్వట్లేదు. నెలలు గడుస్తున్నా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. సినిమా కోసం పెంచుతున్న గడ్డం పొడవు పెరుగుతోంది కానీ.. స్క్రిప్టు మాత్రం ఓకే అవ్వట్లేదు. ఈ సినిమా తేడా కొడితే తన కెరీర్ ప్రమాదంలో పడడమే కాదు.. సొంత నిర్మాణ సంస్థకు నష్టాల భారం కూడా పెరుగుతుంది. అందుకే నితిన్ ఇంత జాగ్రత్త పడుతున్నాడని సమాచారం.