చిరు బాలయ్యలు కల్పించుకుంటారా

అందరూ భయపడినట్టే సంక్రాంతికి థియేటర్ల రచ్చ మొదలైపోయింది. వారసుడుకి మంచి స్క్రీన్లు, ఎక్కువ కౌంట్ వచ్చేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పేట రిలీజ్ టైంలో ఇలాంటి వివాదమే వచ్చినప్పుడు రజినీకాంత్ అయినంత మాత్రాన స్ట్రెయిట్ సినిమాలను పక్కనపెట్టలేం కదాని ఒక ఇంటర్వ్యూలో రాజుగారు అన్న మాటలను వీడియో రూపంలో తవ్వి తీసి మరీ కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ లాంటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ నుంచి థియేటర్ల పేర్లు బయటికి రావడం ఈ రచ్చకు కారణం.

ఇది నిజమైనా కాకపోయినా ఈ సమస్య ఖచ్చితంగా వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. స్వంత చిత్రం కాబట్టి దిల్ రాజు సహజంగానే తన లీజులో ఉన్నవి, స్వంతంగా నడుపుతున్నవి అధిక శాతం వాటిలో వారసుడు వేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. అలాంటప్పుడు బిసి సెంటర్లలో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఇది ఇబ్బందే. షోలు పంచుకోవాల్సి ఉంటుంది. విజయ్ కున్న ఇమేజ్ ని పరిగణనలోకి తీసుకుంటే ఏ కోణంలోనూ చిరు బాలయ్యల దరిదాపుల్లో లేడు. తమిళనాడులో అతను వందల కోట్ల బడా స్టారే కావొచ్చు. కానీ రిలీజ్ టైంలో ఆ అంశం కన్నా ఇక్కడ బిజినెస్ ఎంత చేయగలడనేదే ముఖ్యం.

ఒకవేళ విడుదల దగ్గర పడుతున్న టైంలో ఈ ఇష్యూ కనక పెద్దదైతే చిరంజీవి బాలకృష్ణలు ఇద్దరూ తమ నిర్మాతలు ఒకరే కాబట్టి దీన్ని పరిష్కరించే దిశగా ఒత్తిడి తెస్తారా లేక దిల్ రాజుకే నేరుగా కమ్యూనికేట్ చేస్తారానేది ఇప్పడే చెప్పలేం కానీ ఫ్యాన్స్ మాత్రం కల్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదేదో మొత్తం థియేటర్ల లిస్టు బయటికి వచ్చాక తేలుతుంది కానీ ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో. ఒకవైపు స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు నడపబోతున్న మైత్రి అధినేతలు ఈ ఒత్తిడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. కోట్లతో కాదు మాటలతో జరిగే పనులాయే.