గెస్ చెయ్యలేరు.. సమంత ఛాలెంజ్

అనారోగ్యంతో బాధ పడుతున్నా సరే.. మనో ధైర్యం కోల్పోకుండా పోరాడుతుండడమే కాక.. తన కొత్త సినిమా ‘యశోద’ ప్రమోషన్ల కోసం వీడియో ఇంటర్వ్యూ చేసి తన కమిట్మెంట్‌ను చాటుకుంది సమంత. ఇందులో తన అనారోగ్యం గురించి మాట్లాడుతూ సమంత చూపించిన సంకల్ప బలం అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో అపూర్వమైన మద్దతు లభిస్తోంది.

స్టే స్ట్రాంగ్, అండ్ కమ్ బ్యాక్ అంటూ ఆమెకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో ‘యశోద’ గురించి చాలా ముచ్చట్లే చెప్పింది సామ్. తాను మామూలుగా ఏదైనా కథ వింటే.. ఆ సినిమా చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి కనీసం ఒక్క రోజైనా సమయం తీసుకుంటానని.. కానీ ఈ కథను మాత్రం విన్న వెంటనే ఓకే చేసేశానని ఆమె తెలిపింది.

తనకు థ్రిల్లర్ జానర్ అంటే చాలా ఇష్టమని.. ఈ జానర్లో తెరకెక్కిన ‘యశోద’లో ఊహించని మలుపులు ఉంటాయని ఆమె చెప్పింది. ఈ రోజుల్లో ప్రేక్షకులు బాగా తెలివి మీరిపోయారని.. సినిమాలో 60 శాతం ట్విస్టులను ముందే ఊహించేసి చెప్పేస్తున్నారని.. ఇది దర్శకులకు సవాలే అని ఆమె పేర్కొంది.

దర్శకులకు నువ్వా నేనా అన్నట్లు ఛాలెంజ్ విసురుతున్నారని.. దర్శకులు తమకంటే తెలివైన వాళ్లు అయ్యుండాలని కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ సినిమాల్లో వారి అంచనాలను మించి ట్విస్టులు ఉండేలా చూసుకోవడం సవాలే అని ఆమె పేర్కొంది. ‘యశోద’ సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయని.. కానీ వాటిని ప్రేక్షకులు ముందు గెస్ చేయలేరని.. ఇది తన సవాలు అని సమంత పేర్కొంది. మరి సమంత చెబుతున్న రేంజిలో ‘యశోద’ ట్విస్టులు ప్రేక్షకులను షాక్‌కి గురి చేస్తాయేమో చూడాలి.