ముక్కలు ముక్కలుగా చూస్తున్న తెలుగోళ్లు

ఒక ప్రక్కన గత శుక్రవారం ధియేటర్లకు ఒక అరడజను సినిమాలు జారబడ్డాయి. అల్లు శిరీష్‌ ‘ఊర్వశివో రాక్షసివో’, సంతోష్‌ శోభన్ ‘లైక్ షేర్ సబ్‌స్క్రైబ్’, నందు ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’.. ఇలా కొన్ని సినిమాలు రిలీజై సందడి చేశాయ్. కాని చాలామంది తెలుగు ఆడియన్స్ మాత్రం, ఈ సినిమాలకంటే.. ఓటిటిలో రిలీజైన ‘బ్రహ్మాస్త్ర’ మరియు ‘పొన్నియన్ సెల్వన్ 1’ చూడ్డానికే ఎక్కువగా సుముఖత చూపించినట్లు ట్రెండ్స్ చూస్తే అర్ధమవుతోంది. ఈ సినిమాల్లో మణిరత్నం తీసిన ఆణిముత్యం గురించి కొంచెం గట్టిగానే చెప్పుకోవాలి.

నిజానికి ధియేటర్లలో పొన్నియన్ సెల్వన్ 1 తెలుగు వర్షన్ రిలీజైనప్పుడు చాలామంది తెలుగు ఆడియన్స్‌కు ఒక్కటే ప్రాబ్లమ్. అసలు క్యారక్టర్ల పేర్లు, ఊళ్ళ పేర్లు, కొన్ని డైలాగులూ.. అర్దమైతే ఒట్టు. తెలుగు వర్షన్‌కు డైలాగ్స్ అందించింది దిగ్గజ రైటర్ తనికెళ్ళ భరణి అయినప్పటికీ.. తమిళ పేర్లను అరవ ఫీల్ డైలాగులనూ ఎక్కువగా మార్చలేరు కాబట్టి.. ఉన్నంతలో తమిళానికి దగ్గరగా తెలుగువారికి అర్ధమయ్యేలా రాశారు. కాని ఇప్పుడున్న మోడ్రన్ యూత్ ఎవ్వరికీ అంతటి గ్రాంధీకం, మరియు తమిళ ఫీల్‌తో ఉన్న మద్రాసీ తెలుగు అర్దమవ్వడమే కష్టమే. అందుకే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో సినిమా చూస్తున్నప్పుడు.. మాట్లాడితే పాజ్ చేసుకుని, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి.. ఆ సీన్లో డైలాగ్ ఏంటో అర్ధం చేసుకుని మరీ చాలామంది సినిమాను చూస్తున్నారట.

పైగా ఈ సినిమాను స్టార్ట్ చేసిన పావుగంటకే చాలామంది ఆడియన్స్‌కు బోర్ కొట్టేస్తోంది. దానితో పొద్దున్నో ముక్క, మధ్యాహ్నం ఇంకాస్త, సాయంత్రం కాస్త.. ఆ ముక్కల్లో మళ్ళీ డైలాగులో అర్ధం చేసుకోవడానికి రివైండ్ అండ్ ప్లే స్టయిల్లో ఇక ముక్కముక్కలుగా కట్ చేసుకుని పొన్నియన్ సెల్వన్ 1 ను ఓటిటిలో ఆదరిస్తున్నారు మన ఆడియన్స్. చెప్పాలంటే ఇలా పాజ్ అండ్ రివైండ్ పద్దతిలో చూడ్డం అనేది ఒకప్పుడు అద్భుతమైన సినిమాలకో లేదంటే అద్భుతమైన సీన్లకో జరిగేది. ఇప్పుడు మాత్రం మణిరత్నం పరీక్ష పెట్టడం వలన తెలుగు ఆడియన్స్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైందిలే.