అల్లు అరవింద్ చేస్తోంది కరక్టేనంటారా?

మొన్ననే కాంతారా సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి తీసుకొచ్చిన సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పుడు మరో సినిమాను కూడా టాలీవుడ్‌కు తెస్తున్నారని టాక్. ఈ నెల 24న బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న బేడియా సినిమాను.. తెలుగులోకి తోడేలు అనే టైటిల్‌తో దించుతున్నారట. ఆల్రెడీ డబ్బింగ్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. వరుణ్‌ దావన్, కృతి సేనన్ మెయిన్ లీడ్స్‌గా రూపొందించిన ఈ సినిమా, అన్ని విధాల తెలుగు ప్రేక్షకులకు నచ్చేసే హారర్ కామెడీ కంటెంట్‌తోనే వస్తోంది. కాబట్టి పెద్ద హిట్టు కొట్టడం గ్యారెంటీ అంటూ ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో.. అసలు అల్లు అరవింద్ చేస్తోంది కరక్టేనా అంటూ మరో డిస్కషన్ కూడా మొదలైంది.

పెద్ద పెద్ద డబ్బింగ్ సినిమాలను తెలుగులోకి ఈజీగా తెచ్చేయడం.. గీతా ఆర్ట్స్ కాబట్టి ధియేటర్లకు కొదవుండదు.. కాబట్టి ఆ సినిమాలకు భారీగా ప్రెజెన్స్ క్రియేట్ చేయడం ద్వారా.. వాటితో భారీ విజయాలు కొట్టేస్తున్నారు అల్లు అరవింద్. అయితే ఈ సీనియర్ ప్రొడ్యూసర్ భారీ సినిమాలను ఇలా తెలుగులోకి డబ్ చేసి దించేయడం వలన.. ఇక్కడ తెలుగోళ్లు తీస్తున్న పెద్ద సినిమాలకంటే ఆ సినిమాలకే క్రేజ్ రావడం.. అలాగే అవి హిట్టయితే మన చిన్న సినిమాల మార్కెట్ ఫెయిల్ అయిపోవడం వంటి జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు కొందరు డిస్ట్రిబ్యూటర్స్. మొన్న కాంతారా సినిమా రిలీజైన ఓ వారం తరువాత తెలుగులో ఓరి దేవుడా, ప్రిన్స్, సర్దార్ వంటి సినిమాలు రిలీజయ్యాయ్. కాని కాంతారా చాలా పవర్‌‌ఫుల్‌గా నిలబడటం వలన.. ఈ సినిమాలు దాని పవర్‌ని తట్టుకోలేకపోయాయ్. అందుకే భారీ డబ్బింగ్ సినిమాలను తెలుగులోకి వరుసగా తెస్తే ఇక్కడ మన సొంత సినిమాల మార్కెట్ దెబ్బతింటోందనేది వీరి వాదన.

అయితే.. మనం బెటర్ కంటెంట్ తీయనప్పుడు అల్లు అరవింద్ డబ్బింగ్ సినిమాలు తెస్తున్నారు, దిల్ రాజు డబ్బింగ్ సినిమాలు కొంటున్నాడు అంటూ బ్లేమ్ చేయడం ఎందుకులే అని అంటున్నారు సాధారణ ప్రేక్షకులు. మన తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్ కావట్లేదా? బాహుబలి, కెజిఎఫ్‌ అక్కడ బాగా ఆడేశాయ్ కదా. ఇప్పుడు మన పుష్ప 2, ప్రాజెక్ట్ కె వంటి సినిమాలను ప్యాన్ ఇండియా మూవీస్ అంటూ అక్కడ కూడా రిలీజ్ చేసుకోవాలని చూస్తున్నాం కదా. మనం వాళ్ళ మార్కెట్‌ను క్యాష్ చేసుకుందాం అనుకున్నప్పుడు.. వాళ్లు కూడా క్యాష్‌ చేసుకోవాలని అనుకోవడంతో తప్పేముంది?