పూరీ చుట్టూ పద్మవ్యూహం

లైగర్ తాలూకు ఆర్థిక వ్యవహారాలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాక ఇండస్ట్రీలో దీని గురించి పలురకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఇంతకు మించిన ఫ్లాపులు నష్టాలు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో ఏవీ బజారుకెక్కపోవడంతో పూరి చేసింది రైటా లేక డిస్ట్రిబ్యూటర్లది కరెక్టా అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. హీరో మార్కెట్ కి మించి అత్యాశకు పోయి ఎక్కువ పెట్టుబడి ఇన్వెస్ట్ చేసిన కోణంలో పంపిణీదారులు చేసింది తప్పయితే, మసిపూసి మారేడుకాయని చేసినట్టు లోకల్ ప్రోడక్ట్ ని అంతర్జాతీయ వస్తువుగా ఓవర్ పబ్లిసిటీ ఇచ్చిన పూరి బృందానిది కూడా అంతే మిస్టేక్. మొత్తానికి ఈ వివాదం పూరి మీద గట్టి ప్రభావమే చూపించింది.

ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ ని డిలీట్ చేసేశాడు. మిలియన్ల ఫాలోయర్స్ ఉన్న వెరిఫైడ్ హ్యాండిల్ ఇది. తాను మోసం చేసింది నమ్మి టికెట్లు కొన్న ఆడియన్స్ నే తప్ప ఇంకెవరిని కాదనే ఉద్దేశంతో బయటికి వదిలిన ఒక నోట్ లో పూరి విజయాలు ఓటముల గురించి చాలా క్యాలికులేటెడ్ సిద్ధాంతాలు మాట్లాడాడు. అందరూ చివరికి కలుసుకునేది స్మశానంలోనేనని, ఎవరూ డబ్బును వెంటేసుకుని పోరని చెప్పిన మాటలు అభిమానులను కదిలిస్తున్నాయి. పూరిలో రియలైజేషన్ కనిపిస్తోంది. తాను నేరం చేయకపోయినా ఈ స్థాయిలో టార్గెట్ చేయడం పట్ల ఆవేదన ఆ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది.

ఒకపక్క లైగర్ కాంట్రావర్సీలు, జనగణమన ఆగిపోవడం, కొత్త ప్రాజెక్టు కోసం హీరోలెవరూ అంత సుముఖంగా లేకపోవడం, కొడుకు ఆకాష్ ఇంకా సెటిల్ కాకపోవడం, పూరి వ్యక్తిగత జీవితం గురించి బయట రకరకాల కామెంట్లు వినిపించడం ఇలా ఒక పద్మవ్యూహంలో ఉన్నాడు ఈ కల్ట్ డైరెక్టర్. ఒకప్పుడు హీరోలను స్టార్లుగా మార్చే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడికి ఈ పరిస్థితి రావడం ఫ్యాన్స్ కి బాధ కలిగించేదే. కింద పడేది లేచేందుకే అనే సూత్రాన్ని బలంగా నమ్మే పూరి గట్టిగా తలుచుకుని తనలో రచయితకు దర్శకుడికి సరైన పని కల్పిస్తే బౌన్స్ బ్యాక్ అవ్వడం ఎంతసేపు. దానికోసమే అందరూ వెయిటింగ్.