కదిలించేస్తున్న పునీత్ రాజ్‌కుమార్

పోయినేడాది సరిగ్గా ఇదే రోజు కర్ణాటక ప్రజల్ని పెను విషాదంలో ముంచెత్తుతూ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు పునీత్ రాజ్‌కుమార్. కన్నడిగులు దేవుడిలా కొలిచే దిగ్గజ నటుడు రాజ్ కుమార్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ నటుడిగానే కాక వ్యక్తిగా గొప్ప పేరు సంపాదించిన పునీత్.. అంత చిన్న వయసులో కాలం చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.

అతనెంత గొప్ప మానవతావాది, పబ్లిసిటీకి దూరంగా ఏ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడన్నది తన మరణం తర్వాతే చాలామందికి తెలిసింది. తన గొప్ప వ్యక్తిత్వం, సేవాభావం గురించి తెలుసుకుని ఇతర భాషల వాళ్లు కూడా కదిలిపోయారు. అతడి అంత్యక్రియల సమయంలో ఆ తర్వాత పునీత్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జేమ్స’ విడుదలైనపుడు కన్నడిగుల స్పందన చూసి అందరూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు మరోసారి అందరినీ పునీత్ కదిలించేస్తున్నాడు.

పునీత్ నటించిన అడ్వెంచరస్ డాక్యుమెంటరీ ‘గంధద గుడి’ తాజాగా థియేటర్లలో రిలీజైంది. అడవిలో సాగే అడ్వెంచరస్ జర్నీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అమోఘ వర్ష ఈ డాక్యు డ్రామాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కన్నడనాట పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. వెండితెరపై పునీత్ చివరి దర్శనాన్ని చూసేందుకు కన్నడిగులు భారీగా తరలి వస్తున్నారు. ఇది జస్ట్ డాక్యుమెంటరీ అనుకున్న వాళ్లకు చిత్ర బృందం షాకిచ్చింది. ఇందులో సినిమాకు తక్కువ కాని డ్రామా ఉందట. థ్రిల్లంగ్ మూమెంట్స్ ఉన్నాయట. పునీత్‌కు ఒక రకంగా ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నారు. ఇదొక డాక్యుమెంటరీ కావడంతో పునీత్ రియల్ క్యారెక్టర్‌ను తెరపై చూస్తున్న భావన కలిగి ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.

బెంగళూరులోని ఒక మల్టీప్లెక్స్‌లో వేసిన ప్రిమియర్ షోకు హాజరైన పునీత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సెలబ్రెటీలతో పాటు అభిమానుల్లో ప్రతి ఒక్కరూ ఈ షో చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మిగతా థియేటర్లలోనూ ఇదే భావోద్వేగం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో సైతం ‘గంధద గుడి’ షోలు నడుస్తున్నాయి.