డిజాస్టర్ల వ్యథలు ఇప్పటివి కాదు

లైగర్ ఆర్థిక వ్యవహారాల విషయంలో దర్శకుడు పూరి జగన్నాధ్ వరంగల్ శీను, శోభన్ ల మీద పోలీస్ కంప్లయింట్ దాకా వెళ్లడంతో వ్యవహారం చాలా వేడెక్కింది. గతంలో ఇలాంటి వందల పంచాయితీలు ఇండస్ట్రీలో జరిగాయి కానీ అవేవీ ఇలా పబ్లిక్ గా బయట పడినవి కాదు. కొన్ని రాజీ పడినవి, కొన్ని మా ఖర్మనుకుని బయ్యర్లు వదిలేసినవి, మరికొన్ని హీరోలు నిర్మాతలు సర్దినవి చాలానే ఉన్నాయి. కానీ లైగర్ మాత్రం దీన్ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్లింది. తప్పొప్పులు ఎవరివి ఎలా ఉన్నా ఇలా బజారుకు ఎక్కడం వల్ల న్యూస్ ఛానల్స్ కు కవరేజ్, పబ్లిక్ కి కాసింత టైంపాస్ తప్ప వచ్చేది పోయేది ఏమీ ఉండదు.

చరిత్ర తవ్వుకుంటూ వెళ్తే ఇలాంటి కథలు ఎన్నో కనిపిస్తాయి. దేవివరప్రసాద్ లాంటి అగ్ర నిర్మాత మృగరాజు దెబ్బకు రికవర్ కాలేక ఏకంగా భారీ చిత్రాల నిర్మాణమే మానేసుకున్నారు. సమరసింహారెడ్డి ఇచ్చిన చెంగల వెంకటరావును నరసింహుడు దేనికి ప్రేరేపించిందో రెగ్యులర్ మూవీ లవర్స్ కు గుర్తే. అజ్ఞాతవాసి, స్పైడర్, బ్రహ్మోత్సవం, ఆచార్య ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టుకు అంతుపొంతూ ఉండదు. ఇంకా తరచి చూస్తే స్వర్గీయ ఎన్టీఆర్ సైతం సామ్రాట్ అశోక, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర టైంలో ఇలాంటి అనుభవాలు చూసినవారే. మేజర్ చంద్రకాంత్ వచ్చాకే ఆ డ్యామేజ్ చాలా మటుకు రిపేర్ అయ్యింది.

ఇది చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి హీరోకు దర్శకుడు నిర్మాతకు ఎదురైన పరిణామమే. కాకపోతే ఇటీవలి కాలంలో డైరెక్టర్లు నేరుగా పారితోషికం తీసుకోకుండా ప్రొడక్షన్ లో పార్ట్ నర్ గా ఉండి ఎక్కువ లాభాలను గడించాలనుకునే అత్యాశే ఈ పరిస్థితికి దారి తీస్తోంది. సినిమా అనేది వ్యాపారం. పూరినే అన్నట్టు ఇదో గ్యాంబ్లింగ్. ఖచ్చితంగా ఆడుతుందా లేదా అనేది ఎవరికీ తెలియదు. అంత పసిగట్టగలిగే శక్తే ఉంటే కాంతార తెలుగుని కేవలం రెండు కోట్లకే బిజినెస్ చేసేవారా లైగర్ మీద తొంబై కోట్ల పందెం ఆడేవారా. అన్నిటికి సిద్ధపడే దూకే వ్యాపారం ఇది. ఒక వస్తువు విలువను వెలకట్టడంలో మితిమీరితే జరిగే పరిణామాలకు ఫలితాలు ఇలాగే ఉంటాయి.