ఒట్టు తీసి గట్టున పెట్టిన బాలయ్య


ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు ఏవైనా ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, ప్రకటనలు చేయడాన్ని తక్కువగా చూసేవాళ్లు. ఓవైపు బాలీవుడ్ స్టార్లు పెద్ద స్థాయిలో ప్రకటనలు చేస్తుంటే.. మన హీరోలు మాత్రం అటు వైపు చూసేవారే కాదు. ఐతే చిరంజీవి ఈ విషయంలో ముందడుగు వేసి ‘థమ్సప్’ లాంటి ఒకటీ అరా యాడ్స్ చేశారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘పెప్సి’కి ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత ఆ ఇద్దరూ ప్రకటనల వైపు చూడలేదు.

ఐతే యాడ్స్ చేస్తే సినిమాలను మించి ఆదాయం సంపాదించవచ్చని గ్రహించిన సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాళ్లు ముందడుగు వేశారు. ఇప్పుడు మహేష్ చేతిలో రెండంకెల సంఖ్యలో బ్రాండ్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ సైతం పెద్ద ఎత్తున బ్రాండ్లు దక్కించుకున్నాడు. మిగతా స్టార్ హీరోలు కూడా చాలామంది ప్రకటనల్లో నటిస్తున్నారు. మంచి పే చెక్ అందుకుంటున్నారు.

ఐతే హీరోగా దాదాపు నలభై ఏళ్ల అనుభవం ఉన్న నందమూరి బాలకృష్ణ ఇన్నేళ్లలో ఎప్పుడూ ప్రకటనల జోలికి వెళ్లలేదు. చాలాసార్లు చాలా బ్రాండ్లు ఆయన్ని సంప్రదించినా పట్టించుకోలేదు. తాను ఇలా బ్రాండ్లను ప్రచారం చేయడానికి విరుద్ధం అన్నట్లు మాట్లాడేవారు బాలయ్య. ఐతే ఇన్నాళ్లు ఆ మాటకే కట్టుబడి ఉన్న బాలయ్య ఇప్పుడు ఆ మాట తీసి పక్కన పెట్టేశారు. బాలయ్య సాయి ప్రియ అనే కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు.

ఈ రియల్ ఎస్టేట్ సంస్థ బాలయ్యతో ఒక పెద్ద డీల్ చేసుకుని ఆయనతో ఆల్రెడీ ఒక కమర్షియల్‌ చిత్రీకరణ కూడా పూర్తి చేసింది. ఈ ప్రకటనలో రోల్స్ రాయిస్ కారులో ఎంట్రీ ఇస్తూ రాయల్‌గా కనిపించబోతున్నాడు బాలయ్య. శ్రేయస్ మీడియా ఈ ప్రకటనను రూపొందించింది. ఎన్బీకే 1 అని నంబర్ రాసి ఉన్న రోల్స్ రాయిస్ కారును ఈ ప్రకటనకు సంబంధించి టీజర్ పోస్టర్లో చూపించారు. బాలయ్యకు ప్రకటనల రంగంలోకి ఆహ్వానిస్తూ ఈ పోస్టర్ లాంచ్ చేశారు. మరి ఈ యాడ్‌లో బాలయ్య ఎలా సందడి చేయబోతున్నాడో చూడాలి.