ఒటిటి రూల్స్ అన్నారు.. ఎవ్వరూ ఫాలో అవ్వరే?

దీపావళికి నాలుగు సినిమాలొస్తున్నాయ్ అని ధియేటర్లవైపు చూసేలోపు, ఇక్కడ కూడా కొన్ని రిలీజ్ చేస్తున్నాం చూడండి అంటూ ఓటిటి యాప్ లు హడావుడి చేస్తున్నాయ్. ఆ తరహాలోనే ఓ రెండు వారాల క్రితం ఏకంగా గాడ్‌ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలతో తలపడిన స్వాతిముత్యం సినిమా.. అక్టోబర్ 24న ‘ఆహా’లో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటువంటి ప్రకటనలు చూసినప్పుడు మాత్రం ఆడియన్స్ కు ఒక సందేహ రాకుండా మానదు.

ఏకంగా నెలరోజుల పాటు ఇండస్ట్రీని మొత్తం షట్ డౌన్ చేసేసి.. అగ్రనిర్మాత దిల్ రాజు అధ్యక్షతన కొన్ని డెసిషన్లను తీసుకున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజైన నాలుగు నెలల తరువాతే ఓటిటిలో వచ్చేలా చర్యలు తీసుకున్నామంటూ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరుపున దిల్ రాజు సెలవిచ్చిన సంగతీ తెలిసిందే. కాని ఒక్కళ్ళంటే ఒక్కరు కూడా ఆ రూల్ ను పాటించినట్లు మాత్రం మనకి కనిపించట్లేదు. ఆ మధ్యన సినిమా రిలీజైన రెండు వారాలకే సురేష్‌ బాబు తీసిన శాకిని-డాకిని వంటి సినిమాలు ఓటిటిలోకి వచ్చేశాయి. లైగర్ కూడా అంతే, ఓ నెలరోజుల్లోపే ఓటిటిలో రిలీజ్ చేసేశారు. ఇప్పుడు మరో బడా నిర్మాత సితార ఎంటర్టయిన్మెంట్ నిర్మించిన ‘స్వాతిముత్యం’ కూడా ఓటిటిలో వచ్చేస్తోంది. అసలెవ్వరూ ఫాలో అవ్వనప్పుడు.. నాలుగు నెలల తరువాతే ఓటిటి రిలీజ్ అనే డెసిషన్ ఎందుకు తీసుకున్నట్లు?

నిజానికి సినిమాలు ధియేటర్లలో హిట్లయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజైనా కూడా నిర్మాతకు పెద్ద తేడా ఏముండదు. కాని ఫ్లాప్ అయిన సినిమాను వెంటనే ఓటిటిలో రిలీజ్ చేస్తే మాత్రం.. సదరు స్ట్రీమింగ్ కంపెనీలు కాస్త ఎక్కువగా పేమెంట్ ఇచ్చే ఛాన్సుంది. బహుశా అందుకేనేమో మనోళ్ళు ఈ మధ్యన ఆడని సినిమాలన్నింటినీ ఆల్మోస్ట్ రెండు వారాల్లోనే ఓటిటిలో దింపేస్తున్నారు. కాకపోతే రెండు వారాల్లో ఎలాగో ఓటిటిలో వస్తుంది కాబట్టి.. జనాలు కూడా మరి ధియేటర్లకు టాక్ బాగోకపోతే వెళ్ళట్లేదు. అప్పట్లో ఈ విషయం చర్చించే ఆ రూల్ పెట్టారు.. కాని జస్ట్ ఒక నెల తరువాతనే ఎవ్వరూ దానిని ఫాలో కావట్లేదు.