రీ రిలీజ్ చేసినా అదే ఫలితం

ప్రభాస్ కు ఎంత ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్నా సరే తన పాత సినిమాలు ముఖ్యంగా ఇవేం డిజాస్టర్లు బాబోయ్ అనిపించేవి ఫ్యాన్స్ నే మళ్ళీ చూడమన్నా చూడలేరు. అలాంటిది ఒక సూపర్ డూపర్ ఫ్లాప్ ని పట్టుకొచ్చి థియేటర్లలో రీ రిలీజ్ చేస్తాం వచ్చి చూడండహో అంటే ఏం జరుగుతుంది. రెబల్ దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. వచ్చే వారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా బిల్లా, వర్షంలు ఫోర్ కె వెర్షన్లతో పునఃవిడుదల జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రేజ్ ని ముందే క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతో రెబల్ ని చెప్పుకోదగ్గ స్థాయిలో అన్ని ప్రధాన కేంద్రాల్లో మళ్ళీ రీ రిలీజ్ చేశారు

తీరా చూస్తే వసూళ్లు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. కొన్ని మెయిన్ సెంటర్స్ లో మొదటగా వేసిన షోలు తప్ప మిగిలినవన్నీ పెద్దగా జనం లేక బోసిపోయాయి. ఎందుకంటే అప్పట్లోనే రెబల్ మాములు డిజాస్టర్ కాదు. అరివీర భయంకర హీరోయిజంతో పాటు దర్శకుడు లారెన్స్ మార్కు మితిమీరిన ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందుకే బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఆ సమయంలో నిర్మాతలు దీని వల్ల కలిగిన ఆర్థిక నష్టానికి లారెన్స్ మీద ఫిర్యాదు చేసిన ఉదంతాలున్నాయి. అంత పెద్ద హిస్టరీ ఉంది ఈ రెబల్ వెనుక. అందుకే ఫ్యాన్స్ కి దీని మీద ఎమోషన్ లేదు.

అదేదో బుజ్జిగాడు, ఈశ్వర్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి విజయంతమైన సినిమాలు వేసినా ఒక ప్రయోజనం ఉంటుంది కానీ చూస్తున్నారు కదాని రెబల్ లాంటివి రిపీట్ చేస్తే ముందు ముందు ఈ ట్రెండ్ నెగటివ్ గా మారే ప్రమాదం ఉంది. నితిన్ అడవిని కూడా ఇలాగే తీసుకొచ్చారు కానీ ఈ కళాఖండం చూసేందుకు మూవీ లవర్స్ ఎవరూ సాహసం చేయలేకపోయారు. వర్మ బ్రాండ్, నితిన్ ఇమేజ్ ఏవీ ఇక్కడ పనిచేయలేదు. ఇదంతా ఏమో కానీ రాబోయే బిల్లా, వర్షంలకు మాత్రం హై రేంజ్ రెస్పాన్స్ ని ఖచ్చితంగా చూడొచ్చు. ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తోంది వాటికే.