షూటింగ్స్ ఆపి ఏం సాధించారు?

సినీ పరిశ్రమలో సమస్యలు, ముఖ్యంగా నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోయి ఆదాయం తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రెండు నెలల కిందట యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ షూటింగ్స్ అన్నీ ఆపేసి.. చర్చలు సాగించిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు షూటింగ్స్ ఆగిపోగా.. చర్చోప చర్చల తర్వాత కొన్ని నిర్ణయాలేవో జరిగాయి.

ఆ తర్వాత షూటింగ్స్ కొనసాగాయి. ఐతే ఇలా నెల రోజులు షూటింగ్‌లు ఆపించి ఇండస్ట్రీ పెద్దలు సాధించిందేమీ లేదని.. చిన్న సినిమాలకు సంబంధించి సమస్యలు అలాగే ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే పెరిగాయని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు. టాలీవుడ్ పెద్దలు అసలేం సాధించారని ప్రశ్నిస్తూ ఆయనో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇందులో మల్టీప్లెక్సుల తీరు, కొందరు పెద్దల చేతిలో ఉన్న క్యూబ్, యూఎఫ్ఓ సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఛార్జీల గురించి కూడా నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..

‘‘క్యూబ్, యూఎఫ్ఓ తదితర డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలు చిన్న సినిమాల పాలిట శాపంగా మారాయి. నెల రోజుల పాటు మీరు షూటింగ్స్ ఆపేసి ఏం సాధించారో తెలియజేయాలి. పీవీఆర్ మల్టీప్లెక్సులో ఒక షో అయినా, 7 షోలు అయినా వేయడానికి రూ.9880 వసూలు చేస్తున్నారు. సినీ పోలీస్‌లో ఈ ఛార్జీ రూ.7080గా ఉంది. చిన్న సినిమాలకు ఈ ఛార్జీలు భారంగా పరిణమించాయి. మల్టీప్లెక్సుల్లో మినిమం 35 టికెట్లు లేకుంటే షోలు ఇవ్వరు. చెప్పా పెట్టకుండా సినిమా తీసేస్తారు. చిన్న నిర్మాతల షూటింగ్స్ ఆపేసి మీరు ఏం సాధించారు? ఎంతసేపూ పెద్ద నిర్మాతలకే వత్తాసు పలుకుతున్నారు. చిన్న సినిమాలకు ఉన్న రేట్లలో 25 శాతం తగ్గిస్తామని మోసం చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో 15 శాతం రేట్లు పెంచారు. థియేటర్ల రేట్లు, క్యాంటీన్ రేట్లు వంటివి తగ్గుతాయని, చిన్న సినిమాలకు అన్నీ వరాలే అని చెప్పిన సినీ పెద్దలు సమాధానం చెప్పాలి. సినిమానే జీవితంగా బతుకుతున్న చిన్న నిర్మాతలు ఇప్పుడు తమ చిత్రాలను విడుదల చేసే పరిస్థితుల్లోనే లేరు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు వీటన్నింటికీ సమాధానం చెప్పాలి’’ అని నట్టికుమార్ డిమాండ్ చేశాడు.