ప‌వ‌న్‌-క్రిష్‌.. ఇంకెన్నాళ్లీ హ‌డావుడి?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా మొద‌లై రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇప్ప‌టిదాకా ఆ సినిమా పూర్తి కాలేదు. ఒక ద‌శ‌లో వేగంగానే కొన్ని షెడ్యూళ్లు న‌డిచాయి. సినిమా ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ‌య్యేలా క‌నిపించింది. కానీ మ‌ధ్య‌లో క్రిష్ బ్రేక్ తీసుకుని కొండ‌పొలం సినిమా చేసిన ద‌గ్గ‌ర్నుంచి క‌థ మారిపోయింది. అక్క‌డి నుంచి కొత్త షెడ్యూల్ మొద‌లే కాలేదు.

ఈ సినిమా మీద ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్న స‌మ‌యంలో కొన్ని నెల‌ల కింద‌ట ప‌వ‌న్ అండ్ టీం కొత్త షెడ్యూల్ కోసం ప్రిపేర్ కావ‌డం, యాక్ష‌న్ ఘ‌ట్టాల రిహార్స‌ల్స్‌కు సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేయ‌డం గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఇక కొత్త షెడ్యూల్ మొద‌ల‌వ‌డ‌మే త‌రువాయి అన్నారు. కానీ త‌ర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. కొన్ని నెల‌ల పాటు చ‌ప్పుడే లేదు.

కాగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు గురించి అంద‌రూ మ‌రిచిపోతున్న స‌మ‌యంలో ఇటీవ‌ల మళ్లీ చిత్ర బృందం హ‌డావుడి చేయ‌డం మొదలుపెట్టింది. కొత్త షెడ్యూల్ కోసం వ‌ర్క్ షాప్ అంటూ ఫొటోలు రిలీజ్ చేశారు. రోజువారీ ఫొటోల‌తో రెండు మూడు రోజులు సందడి చేశారు. ఇది ప‌వ‌న్ అభిమానుల‌కు చాలా సంతోషాన్నిచ్చింది. మ‌ళ్లీ ఈ సినిమా ప‌ట్టాలెక్కుతున్నందుకు సంతోషించారు. కానీ మ‌ళ్లీ అంత‌లోనే గ్యాప్ వ‌చ్చింది. చిత్ర బృందం నుంచి సౌండ్ లేదు. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ యాక్ష‌న్ ఘ‌ట్టాల కోసం ప్రిపేర‌వుతున్న ఫొటోలు రిలీజ్ చేశారు.

ఐతే ఇంత‌కుముందు కూడా ప‌వ‌న్ ఇలాగే ప్రిపేర‌య్యాడు. మ‌ళ్లీ ఈ కొత్త ప్రిప‌రేష‌న్ ఏంటో అర్థం కావ‌డం లేదు. ఈసారైనా ఈ ప్రిప‌రేష‌న్ల‌ను దాటి గ్రౌండ్లోకి దిగుతారా.. లేక వ‌ర్క్‌షాప్‌, ప్రిప‌రేష‌న్ అంటూ కొన్ని రోజులు హ‌డావుడి చేసి య‌థాప్ర‌కారం సైలెంట్ అయిపోతారా అని ప‌వ‌న్ అభిమానులే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమాను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ఈ మ‌ధ్య ప్ర‌క‌టించినట్లు వ‌చ్చే ఏడాది వేస‌వికైనా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి మ‌రి.