పవన్ నుండి ప్రభాస్.. ఎలాగమ్మా? హౌ?

కొంతమంది హీరోయిన్లకు ఆఫర్స్ ఎలా వస్తాయో తెలీదు. కొంతమందికి ఎందుకు రావో తెలియదు. ఇప్పుడు ఒక హీరోయిన్ ను చూస్తే అసలు ఈమెకు ఇంత పెద్ద సినిమాల్లో రోల్స్ ఎలా వస్తున్నాయండీ అంటూ ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ముంబయ్ లో మోడలింగ్ చేసుకుంటూ అక్కడ ఒక పెద్ద సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది నిధి అగర్వాల్, కాని ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. ఇప్పుడు ఈ భామకు తెలుగులో ఇద్దరూ అతి పెద్ద స్టార్స్ సినిమాలు చేతిలో ఉన్నాయంటే నమ్మశక్యంగా కూడా ఉండదు కదూ? కాని ఉన్నాయ్.

అప్పట్లో నాగచైతన్యతో సవ్యసాచి సినిమా చేసి తెలుగోళ్ళకు హాయ్ చెప్పిన నిధి, తరువాత అఖిల్ మిస్టర్ మిజ్ఞూ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ రెండు సినిమాలూ ఆడలేదు. ఆమెకు నటిగానూ పేరు రాలేదు. కాని పూరి జగన్ తీసిన ఇస్మార్ట్ శంకర్ లో అందాలను దారబోయడంతో మన ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కాకపోతే అమ్మడికి యాక్టింగ్ రాదని తెలుసు కాబట్టి డైరక్టర్లు పెద్దగా వెంటబడలేదు. కేవలం మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్ గల్లా చేసిన హీరో సినిమాలో మాత్రమే నిధికి ఆఫర్ వచ్చింది.

ఆ తరువాత జరిగిన అతిపెద్ద మిరాకిల్ ఏంటంటే.. ఏకంగా పవన్ కళ్యాణ్‌ హరహర వీరమల్లు సినిమాలో ఆమె హీరోయిన్ అయిపోయింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. మారుతి డైరక్షన్లో ప్రభాస్ చేస్తున్న సినిమాలో కూడా.. మాళవికా మోహనన్ తో పాటు ఇప్పుడు ఇస్మార్ట్ సుందరిని కూడా హీరోయిన్ గా తీసుకున్నారట.

నిజానికి అందమైన భామలు.. నిధికంటే అద్భుతంగా యాక్టింగ్ చేస్తూ అందాలను ఆరబోసే భామలూ చాలామందే ఉన్నారు. వాళ్లందరూ ఉండగా కూడా ఈ 30 ఏళ్ల సుందరికి టాప్ హీరోల సరసన నటించే ఆఫర్స్ ఎలా వచ్చాయ్ అనే సందేహం ఎవరికైనా వస్తుంది. విషయం ఏంటంటే.. పెద్ద హీరోల పేరు చెప్పగానే మెహ్రీన్ వంటి భామలు కోటి కావాలి కోటిన్నర కావాలి అంటున్నారట. నిధి మాత్రం ₹40-60 లక్షల్లోనే చెబుతోందట. దానితో ఈమెకు సినిమాలు వచ్చేస్తున్నాయ్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.