అయితే ధృవ-2 ప‌క్కా అన్న‌మాట‌


మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో ధృవ ఒక‌టి. ఒక ద‌శ‌లో వ‌రుస‌గా మూస మాస్ సినిమాలు చేస్తూ వ‌చ్చిన చ‌ర‌ణ్‌.. ఈ సినిమాతో త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రించుకున్నాడు. త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ అయిన త‌నీ ఒరువ‌న్ ఆధారంగా సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ లుక్, ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్, న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. దీని ఒరిజిన‌ల్ అయిన త‌నీ ఒరువ‌న్‌ను డైరెక్ట్ చేసింది మోహ‌న్ రాజా.

అప్ప‌టిదాకా రీమేక్ సినిమాలే చేస్తూ వ‌చ్చిన మోహ‌న్ రాజా.. ఈ సినిమాతో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇప్పుడ‌త‌ను మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్‌ఫాద‌ర్ చేశాడు. ఆ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌నే వ‌స్తోంది. దీని త‌ర్వాత అత‌ను అక్కినేని నాగార్జున హీరోగా ఓ సినిమా చేసే అవ‌కాశాలున్న‌ట్లు సంకేతాలిచ్చాడు.

దీంతో పాటుగా రామ్ చ‌ర‌ణ్‌తో ధృవ-2 చేసే అవకాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే గాడ్‌ఫాద‌ర్ నిర్మాత ఎన్వీ ప్ర‌సాద్.. ధృవ‌-2 గురించి సంకేతాలు ఇచ్చాడు. ఇప్పుడు స్వ‌యంగా మోహ‌న్ రాజానే ఓ ఇంట‌ర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. తనీ ఒరువ‌న్‌-2 కోసం ఇప్ప‌టికే క‌థ సిద్ధ‌మైంద‌ని, త‌న త‌మ్ముడు జ‌యం ర‌వికి క‌థ వినిపించాన‌ని, అత‌ను ఓకే చెప్పాడ‌ని.. అలాగే రామ్ చ‌ర‌ణ్‌కు సైతం ఈ క‌థ చెప్పాన‌ని, అత‌ను కూడా ఆస‌క్తి చూపించాడ‌ని మోహ‌న్ రాజా తెలిపాడు. త‌నీ ఒరువ‌న్ కంటే ఈ క‌థ ఇంకా బాగుంటుంద‌ని, కాబ‌ట్టి త‌మిళంతో పాటు తెలుగులోనూ సీక్వెల్ చేయ‌డం ప‌క్కా అన్న‌ట్లుగా మాట్లాడాడు మోహ‌న్ రాజా.

ఐతే ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ లైన్లో మూణ్నాలుగు సినిమాలు ఉన్న‌ట్లున్నాయి. మోహ‌న్ రాజా కూడా ఫ్రీ అవ్వ‌డానికి టైం ప‌ట్టొచ్చు. కాబ‌ట్టి భ‌విష్య‌త్తులో వీరి క‌ల‌యిక‌లో ధృవ‌-2 రావ‌డం ప‌క్కా అనుకోవ‌చ్చు.