రష్మిక ఎంట్రీ అదిరిపోయిందట..


కన్నడలో ‘కిరిక్ పార్టీ’, తెలుగులో ‘ఛలో’ అనే చిన్న స్థాయి సినిమాలతో కథానాయికగా పరిచయం అయి.. అవి రెండూ బ్లాక్‌బస్టర్లు కావడంతో రెండు చోట్లా పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక మందన్నా. ముఖ్యంగా తెలుగులో అయితే మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసి ఇక్కడి టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది రష్మిక. తర్వాత ఆమె తమిళంలో కూడా కథానాయికగా పరిచయం అయింది.

సౌత్‌ను ఇలా ఏలుతున్న ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చింది. అక్కడ రెండు పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తొలి సినిమా ‘మిషన్ మజ్ను’ ఇంకా విడుదల కాలేదు కానీ.. దాని తర్వాత ఒప్పుకుని పూర్తి చేసిన ‘గుడ్ బై’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించడం, రష్మిక ఆయన కూతురిగా నటించడం విశేషం.

హఠాత్తుగా చనిపోయిన ఒక ఇంటి ఇల్లాలికి ఆమె కోరుకున్న ప్రకారం తుది వీడ్కోలు ఇవ్వడానికి ఆమె భర్త, కూతురు, ఇతర కుటుంబ సభ్యులు పడే తపనే ఈ చిత్రం. కాన్సెప్ట్ వింటే ఇదొక విషాదభరిత సినిమా అనుకుంటాం కానీ.. దీన్ని చాలా సరదాగా నడిపించాడు రచయిత, దర్శకుడు వికాస్ భల్. ఇంతకుముందు ‘క్వీన్’, ‘సూపర్ 30’ లాంటి మంచి చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన వికాస్.. మరోసారి తన సత్తా చాటాడని ఈ సినిమా చూసిన వాళ్లు అతణ్ని కొనియాడుతున్నారు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగడమే కాక.. అక్కడక్కడా మనసులను కదిలించే ఎమోషన్లతోనూ ఆకట్టుకుందని అంటున్నారు.

ఇటు సమీక్షకులు, అటు సామాన్య ప్రేక్షకుల నుంచి సినిమాకు ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. అమితాబ్‌తో పాటు రష్మిక పెర్ఫామెన్స్‌ను అందరూ కొనియాడుతున్నారు. మొత్తానికి రష్మిక బాలీవుడ్లోనూ ఘనంగా బోణీ కొట్టిందని, ఆమె సుడి మామూలుగా లేదని అంటున్నారు.