దర్శకుడు సీరియస్‌గా వ్యవసాయం చేస్తే..

ఫిలిం సెలబ్రెటీలు నగర శివార్లలో పొలం కొనుక్కుని, అక్కడ ఫాం హౌస్ కట్టుకుని.. పని వాళ్లను పెట్టించి సేంద్రియ వ్యవసాయం చేయించడం, తమతో పాటు సన్నిహితులకు కూడా అక్కడి నుంచే కూరగాయలు, పళ్లు తెప్పించుకోవడం మామూలే. కాస్త పేరున్న ప్రతి సెలబ్రెటీకీ శివార్లలో ఫామ్ హౌస్ ఉంటోంది.

టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్లోనూ ఈ ఒరవడి కొనసాగుతోంది. ఐతే అక్కడ సినీ పరిశ్రమలో చాలామంది సామాన్య, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లున్నారు. వాళ్లింకా మూలాలు కూడా మరిచిపోలేదు. ఇప్పటికీ తాము పుట్టి పెరిగిన ఊర్లకు వెళ్లి కొన్ని రోజులు ఉండి వస్తుంటారు. ఐతే ఒక పేరున్న దర్శకుడు ఏదో చుట్టపు చూపుగా వెళ్లి రావడం కాకుండా కొన్ని నెలల పాటు సొంత ఊరిలోనే ఉండి సీరియస్‌గా వ్యవసాయం చేసి పంటలు పండించి రావడమంటే విశేషమే.

ప్రముఖ తమిళ దర్శకుడు పాండిరాజ్ ఇదే పని చేశాడు. అతను లాక్ డౌన్ టైంలో చెన్నైలో ఉండకుండా సొంత గ్రామానికి వెళ్లిపోయాడు. రైతు బిడ్డ అయిన అతను.. తమ పొలంలోకి దిగి సీరియస్‌గా వ్యవసాయం చేశాడు. పంటలు పండించాడు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి కొత్త పద్ధతులపై అవగాహన పెంచుకుని వ్యవసాయం చేశాడట పాండిరాజ్. సేంద్రియ పద్ధతుల్లో అతను పంటలు పండించాడట.

పాండిరాజ్‌కు వ్యవసాయం మీద ఎంత ప్రేమ, అవగాహన ఉన్నాయో.. అతను కార్తి హీరోగా తెరకెక్కించిన ‘చినబాబు’ చూస్తే అర్థమవుతుంది. అందులో హీరో ఒక రైతు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రంలో వ్యవసాయ సంబంధిత విషయాల్ని చాలా లోతుగా చూపించారు. గ్రామాల్లో పరిస్థితులు, అక్కడి అనుబంధాల గురించి చాలా హృద్యంగా చూపించారు.