సరసమైన ధరలకే మెగా మూవీ

ఇంకో అయిదే రోజులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. మొన్నటిదాకా సోసోగా అనిపించిన బజ్ ట్రైలర్ వచ్చాక పెరిగింది. అంచనాలను అందుకుంటుందనే నమ్మకం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక ఫ్యాన్స్ లో కలిగింది. ఆ మధ్య కొత్త సినిమాలకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఆధారంగా పండగలకు, సెలవులకు మల్టీప్లెక్సుల్లో 295, సింగల్ స్క్రీన్లలో 250 రూపాయల దాకా టికెట్ రేట్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపడం, యావరేజ్ సినిమాలకు ఆక్యుపెన్సీలు పడిపోవడం చాలావాటికి జరిగాయి

మేజర్, విక్రమ్ నుంచి డిస్ట్రిబ్యూటర్లు అలెర్ట్ అయ్యారు. వీలైనంత కనిష్ట ధరలతో అమ్మకాలు చేయడంతో మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు గాడ్ ఫాదర్ కు సైతం అదే రూట్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. అక్టోబర్ 6న హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో బాల్కనీ కేవలం 150 రూపాయలు పెట్టి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇదే మెయిన్ థియేటర్. అంటే మిగిలినవి దాదాపు ఇదే ఫాలో అవుతాయి. రిలీజ్ రోజు టికెట్లు ఇంకా పెట్టలేదు అవి కూడా ఇంతకన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. మరి మల్టీప్లెక్సులు ఎంతకు లాక్ చేస్తాయో చూడాలి. రెండు వందల లోపే అయితే వసూళ్లకు ఢోకా ఉండదు.

దీనికి కారణం ఉంది. ఆచార్యకు ప్రీ రిలీజ్ నెగటివ్ బజ్ ఉందని తెలిసినా అత్యాశకు వెళ్లి ఎక్కువ ధర పెట్టడం వల్ల సాయంత్రానికే దారుణంగా పడిపోయింది. కానీ గాడ్ ఫాదర్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. సో దీన్ని సరిగా క్యాష్ చేసుకుంటే రెండు మూడు వారాలు మంచి రన్ లభిస్తుంది. అసలే ది ఘోస్ట్ గట్టి పోటీ ఇస్తోంది. ఫ్యాన్స్ స్వాతిముత్యంని లైట్ తీసుకుంటున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ప్రస్తుతానికి గాడ్ ఫాదర్ సరసంగానే ఉన్నాడు. మిగిలిన స్క్రీన్లు కూడా ఇదే ఫాలో అయితే రిపీట్లు ప్లాన్ చేసుకున్న ఫ్యాన్స్ కు పండగే.