నాగ్ ఒక్కడే క్లారిటీతో ఉన్నాడు

దసరా సెలవులు మొదలైపోతున్నాయి. కానీ దసరా సినిమాల విషయంలో మాత్రం క్లారిటీ లేదు. పండక్కి సరిగ్గా ఇంకో 12 రోజుల సమయం మాత్రమే ఉండగా.. ఆ వారాంతానికి అనుకుంటున్న సినిమాల విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ఒక్క అక్కినేని నాగార్జున మాత్రమే ది ఘోస్ట్ మూవీతో కచ్చితంగా పండుగ రేసులో నిలుస్తాడనే ధీమా కలుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ కొన్ని నెలల ముందే పూర్తయింది. ట్రైలర్ రెండు నెలల ముందే లాంచ్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తాపీగా చేసుకున్నారు. రిలీజ్ ముంగిట ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమా పక్కాగా అక్టోబరు 5న రిలీజయ్యేలా కనిపిస్తోంది.

కానీ ఈ పండక్కే అనుకుంటున్న మరో మూడు సినిమాల విషయంలో మాత్రం క్లారిటీ లేదు. చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్ విషయంలో అంతులేని అయోమయం కొనసాగుతోంది. చిత్ర బృందం రేయింబవళ్లు పని చేస్తూ దసరా డేట్ అందుకోవాలని చూస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇంకా రెండు రోజుల ప్యాచ్ వర్క్ మిగిలుందని, ఈ రోజు, రేపు ఆ పని పూర్తి చేయబోతున్నారని అంటున్నారు.

ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి తెలుగు, హిందీ భాషల్లో సినిమాను అక్టోబరు 5న రిలీజ్ చేయడం అంటే సవాలుగానే కనిపిస్తోంది. ప్రమోషన్ల మీద చిరు అండ్ టీం దృష్టిపెట్టకపోవడానికి ఈ బిజీనే కారణం. తమ ప్రయత్నం గట్టిగా చేసి, ఇక సాధ్యం కాదు అనుకున్నపుడే వెనక్కి తగ్గాలని, దసరా అడ్వాంటేజీని వదులుకోకూడదని టీం భావిస్తోంది.

ఐతే గాడ్ ఫాదర్ రిలీజ్ విషయంలో ఏదో ఒక క్లారిటీ వస్తే దాన్ని బట్టి మరో రెండు చిన్న సినిమాల భవితవ్యం తేలనుంది. గాడ్ ఫాదర్ విషయంలో డౌట్లతోనే స్వాతిముత్యం, జిన్నా సినిమాలను దసరా రేసులో నిలపాలని చూస్తున్నారు. చిరు సినిమా రాకపోతే ఈ రెండు చిత్రాలు దసరాకే వస్తాయి. అలా కాని పక్షంలో వెనక్కి తగ్గుతాయి. చిరంజీవి సినిమా విషయంలో క్లారిటీ లేదు కాబట్టే వెయిట్ అండ్ సీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. స్వాతిముత్యం సినిమా మేకర్స్ అయితే ప్రస్తుతానికి అక్టోబరు 5 డేటుకే కట్టుబడి ఉన్నారు. అలా అని చిరు, నాగ్ ఇద్దరూ రేసులో ఉంటే ఆ చిన్న సినిమాను రిలీజ్ చేయడం సాహసమే అవుతుంది. విష్ణుకు కూడా వాటికి పోటీగా జిన్నాను రిలీజ్ చేసే ధైర్యం లేకపోవచ్చు. చూడాలి మరి ఏమవుతుందో?