మ‌న‌కెందుకు లేదు 75 భాగ్యం

నేష‌న‌ల్ సినిమా డే సంద‌ర్భంగా 75 రూపాయ‌ల‌కే మ‌ల్టీప్లెక్సుల్లో టికెట్ కొనుక్కుని సినిమా చూసే అవ‌కాశం ద‌క్క‌బోతోంద‌ని ఎంతో ఎగ్జైట్ అయ్యారు సినీ అభిమానులు. యుఎస్‌లో ఈ నెల ఆరంభంలో నేష‌న‌ల్ సినిమా డే జ‌రుపుకున్నారు. ఆ సంద‌ర్భంగా టికెట్ ధ‌ర‌ను చాలా త‌క్కువ‌గా 3 డాల‌ర్లు పెట్ట‌గా అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది.

తెలుగు సినిమా కార్తికేయ‌-2 ఆ రోజు ప్యాక్డ్ హౌసెస్‌తో న‌డ‌వ‌డానికి త‌క్కువ రేటు పెట్ట‌డ‌మే కార‌ణం. ఇది ఇటు ప్రేక్ష‌కుల‌కు, అటు థియేట‌ర్ల యాజ‌మాన్యాల‌కు ఉభ‌య తార‌కంగా క‌నిపించింది. రేటు త‌క్కువ కావ‌డంతో పెద్ద ఎత్తున ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. రేటు త‌క్కువైన‌ప్ప‌టికీ ఎక్కువ టికెట్ల అమ్మ‌కం ద్వారా థియేట‌ర్ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరింది.

ఇండియాలో ఈ నెల 16న నేష‌న‌ల్ సినిమా డే జ‌రుపుకోవాల‌నుకున్నారు. అనివార్య కార‌ణాల‌తో ఒక వారం వాయిదా వేసి 23కు ఫిక్స్ చేశారు. నేష‌న‌ల్ మ‌ల్టీప్లెక్స్ సంఘం టికెట్ల ధ‌ర‌ల‌ను రూ.75కు త‌గ్గించ‌డానికి అంగీక‌రించింది. ఉత్త‌రాదిన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ శుక్ర‌వారం టికెట్ రేటు రూ.75గానే ఉండ‌బోతోంది. బ్ర‌హ్మాస్త్ర మూవీకి ఇది బాగా క‌లిసొచ్చి పెద్ద ఎత్తున టికెట్ల అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి. ఆల్రెడీ 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆ సినిమా టికెట్లు అమ్ముడ‌య్యాయి.

కానీ ద‌క్షిణాదిన మాత్రం మ‌ల్టీప్లెక్సులు ఈ రేటును అమ‌లు చేయ‌ట్లేదు. ఇక్క‌డ థియేట‌ర్ల లైసెన్స్ నిబంధ‌న‌లేవో రేట్లు త‌గ్గించ‌డానికి అడ్డం అవుతున్నాయ‌ట‌. కానీ క‌ర్ణాట‌కలో కూడా తాజాగా శుక్ర‌వారం టికెట్ల ధ‌ర‌ల‌ను రూ.75కు త‌గ్గించేశారు. కానీ తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో మాత్రం రేట్లు య‌థాత‌థంగా కొన‌సాగుతున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో క‌నిష్ఠ ధ‌ర‌ను రూ.112 వ‌ర‌కు త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ట‌. రూ.75కు కుద‌ర‌క‌పోయినా.. ఆ మేర‌కు కూడా రేట్లు త‌గ్గించి సినిమా మీద అమిత‌మైన ప్రేమ చూపించే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఒక రోజు ఆఫ‌ర్ ఇవ్వాల్సిన మ‌ల్టీప్లెక్స్ యాజ‌మాన్యాలు ఆ దిశ‌గా ఆలోచించ‌క‌పోవ‌డంతో నిరాశ త‌ప్ప‌ట్లేదు.