3 లెజెండరీ దర్శకులకు అగ్ని పరీక్ష

ఆగస్ట్ ని బ్లాక్ బస్టర్లతో హోరెత్తించిన టాలీవుడ్ కు సెప్టెంబర్ లో డబ్బింగ్ చిత్రాల తాకిడి ఎక్కువగా ఉంది. పైగా కల్ట్ దర్శకులు ముగ్గురు తీసిన సినిమాలు కేవలం పదిహేను రోజుల గ్యాప్ లో రావడం బహుశా ఇదే మొదటిసారని చెప్పొచ్చు. 17న విడుదల కాబోతున్న శింబు ది లైఫ్ అఫ్ ముత్తు ఏకంగా మూడు గంటల నిడివితో ప్రేక్షకులను పలకరించనుంది. ఏ మాయ చేసావే, ఘర్షణ లాంటి మూవీస్ తో టాలీవుడ్ లోనూ ఫాలోయింగ్ తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రోడక్ట్ కావడంతో మూవీ లవర్స్ దీని కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ఆకర్షణ.

మరొకటి ధనుష్ నేనే వస్తున్నా. 7జి బృందావన్ కాలనీతో యూత్ ని మెప్పించి యుగానికి ఒక్కడుతో ఇక్కడి ఆడియన్స్ ని సైతం షాక్ తో మేజిక్ చేసిన సెల్వ రాఘవన్ ప్రెజెంటేషన్ ఇది. తెలుగు వెర్షన్ ని గీతా ఆర్ట్స్ సమర్పిస్తోంది. ఇప్పటిదాకా బజ్ ఏమి లేదు కానీ మార్కెటింగ్ లో మంచి పట్టున్న అల్లు టీమ్ రిలీజ్ డేట్ అనుకుంటున్న సెప్టెంబర్ 29నాటికి హైప్ తీసుకొస్తారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ దీనికి ప్లస్ కానుంది. తిరు తెలుగులోనూ సక్సెస్ కావడంతో ఈ నేనే వస్తున్నాకి బిజినెస్ బాగా జరగొచ్చు. పైగా గీతా డిస్ట్రిబ్యూషన్ అంటే థియేటర్ల విషయంలో చింత అక్కర్లేదు.

చివరిది 30న రానున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 1. ట్రైలర్ చూశాక ఇందులో ఏ రేంజ్ లో విజువల్ గ్రాండియర్ ఉందో అర్థమయ్యింది. కానీ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న అరవ వాసన వల్ల ఇప్పటికైతే దీని గురించి మనవాళ్ళు పెద్దగా మాట్లాడుకుంటున్న దాఖలాలు లేవు. ఇది అందిస్తోంది దిల్ రాజు కాబట్టి రిలీజ్ గ్రాండ్ గానే ఉంటుంది. ఈ లెజెండరీ డైరెక్టర్లు తీసిన మూడు సినిమాలు ఒకే నెలలో బడా ప్రొడక్షన్ హౌసుల సహకారంతో వస్తున్నాయి. డబ్బింగ్ మార్కెట్ డల్ గా ఉన్న తరుణంలో ఇవి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి. దేనికీ చెప్పుకోదగ్గ భారీ స్ట్రెయిట్ తెలుగు సినిమా పోటీ లేకపోవడం ఒకటే సానుకూలాంశం.