అమ‌ల‌.. అంత భారీ చిత్రానికి నో చెప్పిందా?

మ‌ణిర‌త్నం సినిమాలో అవకాశం అంటే ఏ హీరో, హీరోయిన్ కూడా నో చెప్పే సాహ‌సం చేయ‌రు. ద‌క్షిణాదినే కాక ఇండియా మొత్తంలో త‌ప్ప‌క ఓ సినిమా చేయాల‌ని ఆర్టిస్టులు కోరుకునే ద‌ర్శ‌కుల్లో మ‌ణిర‌త్నం ఒక‌డు. అలాంటి ద‌ర్శ‌కుడికి నో చెప్పింద‌ట అమ‌లా పాల్. అది కూడా మ‌ణిర‌త్నం మెగా ప్రాజెక్ట్ పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో కావ‌డం ఆశ్చ‌ర్యం కలిగించే విష‌యం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అమ‌లా పాలే ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డం విశేషం. కొన్నేళ్ల కింద‌టే పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలో ఓ పాత్ర కోసం మ‌ణిర‌త్నం.. అమ‌ల‌ను ఆడిష‌న్ చేశాడ‌ట‌.

ఐతే ఆ ఆడిష‌న్ స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని.. ఆ పాత్ర‌కు తాను న‌ప్ప‌న‌ని ప‌క్క‌న పెట్టార‌ని అమ‌ల వెల్ల‌డించింది. కాగా గ‌త ఏడాది మ‌ళ్లీ మ‌ణిర‌త్నం టీం త‌న‌ను అదే పాత్ర‌కు సంప్ర‌దించింద‌ని, కానీ త‌న‌కు అప్పుడు ఆ పాత్ర చేసే ఆస‌క్తి పోయింద‌ని, దీంతో తాను ఆ సినిమాను వ‌దులుకున్నాన‌ని అమ‌ల తెలిపింది. మ‌రి పొన్నియ‌న్ సెల్వ‌న్‌లో న‌టించ‌లేక‌పోయినందుకు ప‌శ్చాత్తాప‌ప‌డుతున్నారా అని అడిగితే అలాంటిదేమీ లేద‌ని, కొన్నిసార్లు కొన్ని విష‌యాలు ఇలా జ‌రుగుతుంటాయ‌ని అమ‌ల పేర్కొంది. ఐతే తాను మ‌ణిర‌త్నంకు పెద్ద అభిమానిన‌ని.. ఆయ‌న దర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి ఎదురు చూస్తున్నాన‌ని అమ‌ల చెప్పింది.

పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాలో కీల‌క‌మైన లేడీ క్యారెక్ట‌ర్స్ చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లోనే ఉన్నాయి. క‌థ‌లో అత్యంత కీల‌క‌మైన నందిని పాత్ర‌లో ఐశ్వ‌ర్యారాయ్ న‌టించ‌గా.. మ‌రో ముఖ్య పాత్ర‌ను త్రిష పోషించింది. అమ‌ల స్థాయికి ఈ రెండు పాత్ర‌ల్లో ఒక‌టి ద‌క్కే అవ‌కాశం లేదు. బ‌హుశా ఐశ్వ‌ర్యా ల‌క్ష్మి చేసిన పాత్ర‌ను అమ‌ల‌కు మ‌ణిర‌త్నం ఆఫ‌ర్ చేసి ఉండొచ్చేమో. మ‌రి అమ‌ల ఈ పాత్ర చేయ‌నందుకు నిజంగా రిగ్రెట్ అవుతుందా లేదా అన్న‌ది ఈ నెల 30న పొన్నియ‌న్ సెల్వ‌న్ రిలీజ‌య్యాక తెలుస్తుంది.