పైరసీ అడ్డుకట్ట పెద్ద సవాలే

దశాబ్దాలు గడుస్తున్నా సినిమా పరిశ్రమ పరిష్కారం కనుక్కోలేని తీవ్రమైన ఒకే సమస్య పైరసీ. 90వ దశకంలో వీడియో క్యాసెట్లతో మొదలైన ఈ భూతం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయాక చిత్ర విచిత్ర రూపాలు సంతరించుకుంటోంది. హీరోలు ఎంత పోరాడినా, నిర్మాతలు ఎన్ని ఫిర్యాదులు చేసి దొంగలను పట్టించినా రూపం మార్చుకుంటోంది తప్ప ఆగడం లేదు. విసుగొచ్చిన ఇండస్ట్రీ పెద్దలు, స్టార్లు ఏమీ చేయలేక వదిలేశారు. ఇదే అదనుగా ఆఖరికి టెలిగ్రామ్ లాంటి యాప్స్ ని వాడి మరీ ఈ భూతాన్ని స్మార్ట్ ఫోన్లలోకి ఉచితంగా పంచుతున్న ఆన్ లైన్ దొంగలు లక్షల్లో ఉన్నారు.

ఎప్పటికప్పుడు భారీ చిత్రాలు వచ్చినప్పుడంతా ఆయా యూనిట్లు జాగ్రత్త పడటం ఫ్యాన్స్ కోసం ఫోన్ నెంబర్లు, ఈమెయిళ్లు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి బ్రహ్మాస్త్ర యూనిట్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఢిల్లీ హైకోర్ట్ ద్వారా పద్దెనిమిది సైట్లను బ్లాక్ చేయించేలా ఆదేశాలు తీసుకొచ్చింది. కానీ ఈ నెంబర్ చాలా అంటే చాలా తక్కువ. ఎక్కడో విదేశాల్లో ఆపరేట్ చేసే దుండగులు న్యాయస్థానం ఆదేశాలను ఎంతమేరకు పట్టించుకుంటారో చూడాలి. ఆ మధ్య ఐబొమ్మ, తోప్ టీవీ లాంటి వాటిని కట్టడి చేయగలిగారు కానీ పూర్తిగా అరికట్టలేకపోయారు. విక్రమ్ కోబ్రాకు సైతం ఇదే చేశారు కానీ ప్రయోజనం కలగలేదు

ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ లు సైతం వీటి బారిన పడ్డవే. అయినా సినిమా బాగుంటే జనం థియేటర్లకొస్తారని సీతారామం, బింబిసార, కార్తికేయ 2 ఋజువు చేశాయి కాబట్టి బ్రహ్మాస్త్ర బృందం మరీ అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎలాగూ ఖచ్చితంగా ఆడుతుందన్న ధీమా ప్రమోషన్లలో కనిపిస్తోంది కనక కూల్ గా ఉండటమే బెటర్. ప్రముఖులకు, కొందరు మీడియా ప్రతినిధులకు ముంబైలో ఎల్లుండి సాయంత్రమే స్పెషల్ ప్రీమియర్లు వేయబోతున్నారు. 9వ తేదీ తెల్లవారకుండానే దీని తాలూకు రిపోర్టులు రివ్యూలు వచ్చేస్తాయన్న మాట. చూద్దాం మరి.