సోషల్ మీడియాకు ఛార్మి బ్రేక్

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న తెలుగు చిత్రం ఏది అంటే.. అందరూ ‘లైగర్’ పేరే చెబుతారు. ఈ సినిమా గురించి విడుదలకు ముందు ఇచ్చిన బిల్డప్‌కు, ఆ తర్వాత సినిమాలో ఉన్న విషయానికి సంబంధం లేకపోవడమే అందుక్కారం. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి.. ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు సినిమాను విపరీతంగా లేపారు. తామో అద్భుతమైన సినిమా తీసినట్లు చెప్పుకున్నారు. కానీ తీరా చూస్తే.. తెర మీద జనాలకు ఒక రొడ్డకొట్టుడు మాస్ మసాలా మూవీ కనిపించింది.

ఆరంభం నుంచి చివరి దాకా సినిమాలో ఎక్కడా చిన్న స్పార్క్ కనిపించలేదు. దీని గురించా ఇంత బిల్డప్ ఇచ్చారు అంటూ.. మార్నింగ్ షో దగ్గర్నుంచే విపరీతంగా సినిమాను ట్రోల్ చేశారు నెటిజన్లు. నెగెటివ్ టాక్ అడవిని కాల్చేస్తున్న మంట లాగా విస్తరించింది. దీంతో సినిమా తొలి రోజూ బూడిదైపోయింది. వీకెండ్లో కూడా సినిమా సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది.

హీరో విజయ్ మాత్రమే కాక దర్శకుడు పూరి, నిర్మాత ఛార్మిల మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. విజయ్, పూరి సోషల్ మీడియాలో ఇన్‌యాక్టివ్‌గానే ఉన్నారు కానీ.. ఛార్మి తమ సినిమా గురించి పాజిటివ్ ట్వీట్లును తీసి రీట్వీట్ చేస్తూ కనిపించింది. కానీ వాటి కింద జనాలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆమెను బూతులు తిట్టారు. అవి కాక ఛార్మిని ట్యాగ్ చేసి వేసిన ట్రోల్ ట్వీట్లు ఎన్నో. వీటి ధాటికి ఛార్మి సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. ‘‘చిల్ గయ్స్.. చిన్న బ్రేక్ తీసుకుంటున్నా (సోషల్ మీడియా నుంచి). పూరి కనెక్ట్స్ పుంజుకుంటుంది.. ఇంకా మెరుగ్గా, పెద్దగా. అప్పటి వరకు మీరు బతకండి. వేరే వాళ్లను బతకినవ్వండి’’ అని ఛార్మి ట్వీట్ చేసింది. చివర్లో అన్న ‘బతకండి.. బతకనివ్వండి’ అనే మాటను అనుసరించి ఆమె సోషల్ మీడియా ట్రోల్స్ దెబ్బకు బెంబేలెత్తిపోయిందని అర్థమవుతోంది. అందుకే సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది.