మహేష్ ని ఫుల్లుగా వాడేస్తున్నారు

శాటిలైట్ ఛానల్స్ ఒకప్పుడు కొత్త సినిమాలను నమ్ముకుని ఎక్కువగా పోటీ పడేవి. కానీ ఓటిటిలు వచ్చాక ఈ దూకుడు మునుపటిలా లేదు. థియేటర్ కు వచ్చిన నెల రోజులకే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ మీద లేటెస్ట్ మూవీస్ అన్నీ వస్తుండటంతో అదే పనిగా యాడ్స్ ని భరిస్తూ టీవీలో ప్రీమియర్లు చూసే ఓపిక ప్రేక్షకుల్లో తగ్గిపోయింది. ఈ కారణంగానే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు తెచ్చిన ఆర్ఆర్ఆర్ అల వైకుంఠపురములోని దాటలేకపోగా, కెజిఎఫ్ చాఫ్టర్ 2 ఎప్పుడో జమానాలో వచ్చిన రజనీకాంత్ రోబో టిఆర్పిని టచ్ చేయలేకపోయింది.

అందుకే ఇప్పడు ఛానల్స్ ఫోకస్ రియాలిటీ షోల మీద ఎక్కువగా ఉంటోంది. ఎంత ఖర్చు పెట్టయినా సరే ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. స్టార్ మా బిగ్ బాస్ పుణ్యమాని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని, చిరంజీవి, వెంకటేష్ తదితరులను యాంకర్లుగా గెస్టులుగా తీసుకొచ్చి బాగా లాభపడింది.

జెమినీ తారక్ తో చేయించిన ఎవరు మీలో కోటీశ్వరులు కోసం రామ్ చరణ్ తో మొదలుపెట్టి తమన్ దాకా ఎందరో సెలబ్రిటీలు హాజరై ఆ ప్రోగ్రాంకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చారు. అందుకే ఈ విషయంలో వెనుకబడ్డామని గుర్తించిన జీ ఛానల్ ఏకంగా మహేష్ బాబునే రంగంలోకి దించింది. సండే స్పెషల్ గా వస్తున్న ఓ డాన్స్ ప్రోగ్రాం ఎపిసోడ్ కు మహేష్ తో పాటు సితార పాపను కూడా అతిథులుగా తీసుకొచ్చారు.

వీటి తాలూకు ప్రోమోలు ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి. పార్టిసిపెంట్స్ కు అవకాశం ఇస్తానని ప్రిన్స్ మాటివ్వడం, చిన్నపిల్లల ముద్దు మాటలు, డాన్సర్ల ఎగ్జైట్మెంట్ అంతా ఓ రేంజ్ లో సాగిపోయింది. మహేష్ తో ఏడాది కాలానికి సదరు ఛానల్ అగ్రిమెంట్ చేసుకుందని టీవీ వర్గాల టాక్. ఇందుకు గాను తొమ్మిది కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారనే ప్రచారం కూడా ఉంది కానీ దీనికి సంబంధించి ఎలాంటి ధృవీకరణ లేదు. మొత్తానికి మహేష్ ని మాములుగా వాడటం లేదు.