3 సినిమాలకు ఒకే చిక్కు

ఎంత కాదనుకున్నా ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద కనీసం ఇద్దరు ముగ్గురు హీరోల పోటీ తప్పడం లేదు. ప్యాన్ ఇండియా మూవీ ఉన్నా సరే లెక్క చేయని పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకే నాలుగు వందల కోట్లతో రూపొందిన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన శర్వానంద్ ఒకే ఒక జీవితం ఫేస్ టు ఫేస్ తలపడేందుకు రెడీ అయ్యింది. కంటెంట్ మీద నమ్మకం కావొచ్చు లేదా వేరే ఆప్షన్ లేకపోవడం ఉండొచ్చు.

కారణం ఏదైతేనేం రోజు చివరిలో ప్రేక్షకులు మెచ్చిన బొమ్మే బ్లాక్ బస్టర్ అవుతుంది. కొన్నిసార్లు మాత్రం ఊహించని అనూహ్య పరిణామాలు తలెత్తుతాయి. సెప్టెంబర్ 16 దానికి వేదిక కానుంది. ఆ రోజు మొత్తం మూడు సినిమాలు రాబోతున్నాయి. మొదటిది ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుధీర్ బాబు -కృతి శెట్టి కాంబినేషన్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ రాంకాం ఎంటర్ టైనర్ మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి అంచనాలున్నాయి.

కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని తొమ్మిది నుంచి పోస్ట్ పోన్ చేసుకుని ఇదే డేట్ ని లాక్ చేసుకుంది. ఎస్ఆర్ కళ్యాణమండపం దర్శకుడు శ్రీధర్ గాదె డైరెక్షన్ లో మాస్ ఎలిమెంట్స్ తో దీన్ని తీసినట్టు ట్రైలర్, సాంగ్స్ తాలూకు విజువల్స్ చూశాక క్లారిటీ వచ్చింది. మూడోది నివేదా థామస్ – రెజీనా టైటిల్ రోల్స్ పోషించిన శాకినీ డాకిని. సుధీర్ వర్మ దర్శకుడు. సురేష్ లాంటి పెద్ద బ్యానర్ నిర్మాణ భాగస్వామిగా ఉంది.

ప్రమోషన్ చూస్తే మంచి యాక్షన్ థ్రిల్లరనే అభిప్రాయం కలుగుతోంది. ఈ మూడూ క్లాష్ అవుతున్న సెప్టెంబర్ 16 నేషనల్ సినిమా డేగా మల్టీప్లెక్సులన్నీ కేవలం 75 రూపాయలకే టికెట్లను అమ్మబోతున్నాయి. దేశవ్యాప్తంగా 4000కి పైగా స్క్రీన్లలో ఈ వెసులుబాటు ఇస్తారు. అంటే ఇప్పుడున్న రేట్లలో సగానికి కంటే తక్కువకే అన్నమాట. మరి ఈ స్కీం వీటికి ప్లస్ అవుతుందో లేక రెవిన్యూ తగ్గుతుంది కాబట్టి మైనస్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఈ ఆఫర్ ఒక్క రోజుకే పరిమితమైనా ఫస్ట్ డేకే ఇంత డిస్కౌంట్ ఇవ్వడం ఆడియన్స్ యాంగిల్ లో మంచిదే కానీ మరి కలెక్షన్ అమౌంట్ లో పడే కోతను ఎలా భర్తీ చేసుకుంటారో చూడాలి.