సరికొత్త టెక్నాలజీతో 8K సింహాసనం

ఎంత టెక్నాలజీ పెరిగినా ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ని వెండితెర మీద చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు తేల్చి చెప్పేశారు. పోకిరి 1 కోటి 70 లక్షల గ్రాస్ తో వామ్మో అనిపిస్తే జల్సా ఏకంగా డబుల్ మార్జిన్ తో 3.2 కోట్లు సాధించి మతులు పోగొట్టింది. తమ్ముడు, ఒక్కడు సైతం మంచి స్పందన దక్కించుకున్నాయి. ఘరానా మొగుడుకి క్వాలిటీ ఇష్యూస్ వల్ల కొంత ఇబ్బంది కలిగింది కానీ సరైన ప్లానింగ్ ఉంటే మెగాస్టార్ సైతం ముప్పై ఏళ్ళ పాత సినిమాతో రికార్డులు బద్దలు కొట్టేవారే. ఇక్కడితో ఈ రీ రిలీజుల కహాని అయిపోలేదు.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ టైం మెషీన్ ని మరింత వెనక్కు తీసుకెళ్లబోతున్నారు. 1986లో వచ్చిన ఆల్ టైం హిట్ సింహాసనంని 8K రెజోల్యూషన్ తో పాటు డాల్బీ డిటిఎస్ తో రీ మాస్టరింగ్ చేయిస్తున్నారు. టాలీవుడ్ మొదటి 70 ఎంఎం మూవీగా ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్టీరియో ఫోనిక్ సౌండ్ ని దీని ద్వారానే పరిచయం చేశారు. అప్పట్లో సింహాసనం ఓపెనింగ్స్ గురించి పత్రికల్లో ఎన్ని కథనాలు వచ్చేవో. ఎక్కడ చూసినా జనం కలెక్షన్ల గురించి మాట్లాడుకునేవాళ్ళు. బప్పీలహరి సంగీతం పెద్ద సెన్సేషన్. ఆకాశంలో ఒక తార, వాహవా నీ యవ్వనం సాంగ్స్ ఇప్పుడు విన్నా గూస్ బంప్స్ ఖాయం.

అలాంటి మాస్టర్ పీస్ ని కొత్త సాంకేతికతతో అందించడం మంచి పరిణామం. బాహుబలి తరహాలో ఇది కూడా జానపద ఫాంటసీ. ప్రభాస్ లాగే కృష్ణ గారిది డ్యూయల్ రోల్, జయప్రద, మందాకినీ, రాధల గ్లామర్ కి ఆనాటి యూత్ పరవశించిపోయారు. షోలే ఫేమ్ అంజాద్ ఖాన్ నటించడం మరో ప్రత్యేకత. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న సింహాసనంని సరికొత్తగాఎక్స్ పీరియన్స్ చేయించాలనుకోవడం మంచి ఆలోచన. ఇదంతా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ 2010లో మాయాబజార్ కలర్ వెర్షన్ ని రీ రిలీజ్ చేయడం ద్వారా ఎప్పుడో దీనికి బీజం పడింది. కాకపోతే ఇప్పుడు ఊపొచ్చింది.