తెలుగు బ్రహ్మాస్త్రకు మొదటి దెబ్బ

బాలీవుడ్ తో సమానంగా తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేసుకుని ఇక్కడ ప్రత్యేక ఫోకస్ పెడుతున్న బ్రహ్మాస్త్ర బృందానికి ప్రమోషన్ల పరంగా మొదటి ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అనూహ్య కారణాల వల్ల రద్దు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సోషల్ మీడియాని గత మూడు రోజుల నుంచి ప్రచారంతో హోరెత్తించడంతో వేల సంఖ్యలో అభిమానులు చాలా ముందుగానే వేదిక జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.

బయటికి అధికారిక కారణాలు చెప్పలేదు కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది భద్రతా దృష్ట్యా పోలీస్ శాఖ ఇచ్చిన సూచన మేరకే క్యాన్సిల్ చేశారట. భాగ్యనగరంలో ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి. వేల సంఖ్యలో విగ్రహాల దగ్గర పోలీసు పహారా అవసరమవుతోంది. ఇటీవలి రాజకీయ పరిణామాలు కొంత సున్నితమైన వాతావరణాన్ని సృష్టించడంతో సినిమా వేడుకల కోసం రిస్క్ తీసుకునే పరిస్థితిలో డిపార్ట్ మెంట్ లేదు. దానికి తోడు అనుమతులు రావడంలో ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తప్పలేదట.

ఫ్యాన్స్ కి రివీల్ చేయని ఒక ప్రైవేట్ ఫైవ్ స్టార్ హోటల్ లో బ్రహ్మాస్త్ర ఈవెంట్ ని పూర్తి చేయబోతున్నారు. రన్బీర్ కపూర్ అలియా భట్ నాగార్జునలతో పాటు తారక్ ని ఒకే స్టేజి మీద చూసుకుని మురిసిపోవాలని ఆశపడ్డ అభిమానులకు ఇది నిరాశ కలిగించే పరిణామం. రిలీజ్ కేవలం వారం రోజులే ఉన్న నేపథ్యంలో బ్రహ్మాస్త్ర టీమ్ కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెడుతోంది. హైప్ ని పెంచి రికార్డు ఓపెనింగ్స్ వచ్చేందుకు ఎంత చేయాలో అంతా చేస్తోంది. కానీ  ఇలా అనుకోని అవాంతరాలు వస్తాయని ఎవరు మాత్రం ఊహిస్తారు.