‘భీమ్లా నాయక్‌’కు లైన్ క్లియర్

ఈ ఏడాది కొవిడ్ మూడో వేవ్ ప్రభావంతో డల్ అయిన బాక్సాఫీస్‌కు మళ్లీ ఊపు తెచ్చిన సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. ఈ ఏడాది విడుదలైన తొలి భారీ చిత్రం అదే కావడం, మంచి టాక్ రావడంతో దాన్ని బాగానే ఆదరించారు జనం. కాకపోతే ఫిబ్రవరిలో అన్ సీజన్లో రిలీజ్ కావడం, ఏపీలో టికెట్ల ధరలు మరీ తక్కువ ఉండడంతో ఆ చిత్రం అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయినా సరే.. ఆ చిత్రాన్ని హిట్ మూవీగానే పరిగణించాలి.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటే హిందీలోనూ రిలీజ్ చేయాలని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రణాళికలు రచించింది. హిందీ వెర్షన్‌కు డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసింది. కానీ తెలుగుతో పాటే అది విడుదల కాలేదు. తెలుగు రిలీజ్ హడావుడిలో పడి హిందీ వెర్షన్‌ను అనుకున్నట్లు రిలీజ్ చేయలేకపోయారేమో అనుకున్నారు. తర్వాత రెండు వారాల గ్యాప్‌లో హిందీ వెర్షన్‌ను రిలీజ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీనికి వేరే కారణముంది.

‘భీమ్లా నాయక్’ మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషియుం’కు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. దీని హిందీ రీమేక్ హక్కులను జాన్ అబ్రహాంకు చెందిన సంస్థ సొంతం చేసుకుంది. ఐతే హిందీలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించడంలో ఆలస్యం జరుగుతోంది. ఈలోపే తెలుగులో ‘భీమ్లా నాయక్’ చకచకా పూర్తయి విడుదలైపోయింది. ఆ సినిమాను హిందీలో రిలీజ్ చేయబోతుంటే తమకు ఇబ్బంది అవుతుందని జాన్ అబ్రహాం సంస్థ కోర్టుకెళ్లింది. ఈ కేసు చాన్నాళ్లు నలిగి చివరికి ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు సమాచారం.

‘భీమ్లా నాయక్’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను వాళ్లు రిలీజ్ చేసుకోవడానికి లైన్ క్లియరైంది. ఒకప్పుడైతే ఇలా ఓ తెలుగు సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే బాలీవుడ్ వాళ్లు పట్టించుకునేవారు కాదు కానీ.. ఈ మధ్య మన సినిమాలు అక్కడ ఇరగాడేస్తుండడంతో తాము తీయబోయే రీమేక్ వెర్షన్‌కు ‘భీమ్లా నాయక్’ గండి కొడుతుందని భయపడ్డట్లున్నారు. ఐతే ఎంత ప్రయత్నించినప్పటికీ ‘భీమ్లానాయక్’ హిందీ వెర్షన్‌ రిలీజ్‌ను అడ్డుకోలేకపోతున్నారు. కానీ ఇంత ఆలస్యంగా రిలీజవుతున్న ‘భీమ్లానాయక్’ హిందీ వెర్షన్ ఏమాత్రం ప్రభావం చూపుతుందన్నదే సందేహం.