స్నేహితుడ్ని అరెస్టు చేయించిన అమలాపాల్

మరోసారి వార్తల్లోకి వచ్చింది నటి అమలాపాల్. మిగిలిన హీరోయిన్లకు కాస్త భిన్నంగా ఉంటుంది ఆమె వైఖరి. తరచూ ఏదో ఒక వివాదంలో ఆమె పేరు వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో.. మిగిలిన నటీమణులకు భిన్నంగా గ్లామర్ రోల్ తో పాటు నటనకు అస్కారం ఇచ్చే పాత్రలకు ఓకే చెబుతుంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలంటే అమలాపాల్ తర్వాతే ఎవరైనా అన్న మాట వినిపిస్తోంది. అలాంటి ఆమె తాజాగా ఒక స్నేహితుడి మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటమే కాదు.. అతగాడు అరెస్టు అయ్యేందుకు కారణమయ్యారు. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

సినిమా ఇండస్ట్రీలో పరిచయాల్లో భాగంగా భువి అలియస్ భవ్ నిందర్ సింగ్ దత్ తో అమలాపాల్ కు పరిచయం ఉంది. అతడు.. అతని కుటుంబ సభ్యులు.. స్నేహితులతో కలిసి తాను ఒక సినీ సంస్థను షురూ చేశారు అమలాపాల్. ఈ సంస్థ కోసం విళుపురం జిల్లా పెరియముదలియార్ చావడిలో ఒక బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే తేడా కొట్టింది. మొదట్లో అతనికి స్నేహంగా ఉన్నా.. ఆ తర్వాతి కాలంలో తేడాలు వచ్చి విడిపోయారు. అయితే.. సంస్థను ప్రారంభించిన సమయంలో అమలాపాల్ భువన్ తో సన్నిహితంగా ఉండేవారు. అంతా బాగా ఉన్నప్పుడు.. అందరి మాదిరే సన్నిహితంగా ఉన్న వేళలో కొన్ని ఫోటోలు తీసుకున్నారు. తేడాలు వచ్చి విడిపోయిన తర్వాత తాను సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని.. భవ్ నిందర్ సింగ్ దత్ తో పాటు అతని బంధువులు బెదిరింపులకు దిగినట్లు పేర్కొన్నారు.

అందులో భాగంగా తన దగ్గరున్న డబ్బుతో పాటు ఆస్తుల్ని కూడా కాజేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసునునమోదు చేసిన పోలీసులు 16 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా భవ్ నిందర్ సింగ్ దత్ ను అరెస్టు చేశారు. ఒకప్పటి అమలాపాల్ సన్నిహిత స్నేహితుడు ఇప్పుడు జైలు ఊచలు లెక్కేసే పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.