నేలకు దిగిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండకు ‘లైగర్’ రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ సినిమా గురించి అతను చెప్పిన మాటలకు, వాస్తవంగా చిత్రంలో ఉన్నదానికి అసలు పొంతన లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ట్రోల్ అయ్యాడు విజయ్. అతడికి ట్రోల్స్ కొత్తేమీ కాదు కానీ.. ఈసారి మాత్రం మామూలుగా టార్గెట్ అవ్వలేదు. సినిమా బాగా ఆడుతుంటే.. ట్రోల్స్ గురించి కూడా పట్టించుకునేవాడు కాదు కానీ.. టాక్ మరీ దారుణంగా ఉండడం, రెండో రోజు నుంచి వసూళ్లు ఒక్కసారిగా పడిపోవడం అతణ్ని కలవరపాటుకు గురి చేసినట్లే అనిపిస్తోంది.

తన చుట్టూ ఇంత నెగెటివిటీ చూసేసరికి విజయ్ కొంత కంగారు పడ్డట్లే ఉన్నాడు. సినిమా రిలీజ్ తర్వాత కొంత సమయం మౌనంగా ఉండిపోయిన అతను.. ఆదివారం బయటికి అడుగు పెట్టాడు. తెలుగుతో పోలిస్తే హిందీలో ‘లైగర్’ కొంచెం మెరుగ్గా ఆడుతుండటంతో అక్కడ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి నిర్ణయించుకున్నాడు.

తాజాగా విజయ్ ముంబయికి చేరుకుని అక్కడ ఫేమస్ ఎగ్జిబిటర్ అయిన మనోజ్ దేశాయ్‌ని కలిశాడు. ‘లైగర్’ పీఆర్ వర్గాలు సంబంధిత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య వరుసగా బాలీవుడ్ సినిమాలను బాయ్‌కాట్ చేస్తున్న నార్త్ ఇండియన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి విజయ్ చేసిన వ్యాఖ్యల్ని విజయ్ ఉపసంహరించుకున్నట్లు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘లైగర్’ ప్రమోషన్లలో భాగంగా విజయ్ దుబాయ్‌కి కూడా వెళ్తున్నాడట.

అక్కడ ఆసియా కప్ మ్యాచ్‌లో ‘లైగర్’ను ప్రమోట్ చేస్తాడట. మొత్తానికి తాను ‘లైగర్’ రిలీజ్‌కు ముందు మరీ అతి చేశానని.. బాయ్‌కాట్ బ్యాచ్‌ను కెలకాల్సింది కాదని విజయ్ రియలైజ్ అయినట్లున్నాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాయ్‌కాట్ బ్యాచ్ గురించి అడిగితే.. చేస్తే చేస్కోండి, ఏమవుతుంది అన్నట్లు విజయ్ మాట్లాడడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. కాగా ‘లైగర్’ తెలుగు రాష్ట్రాల్లో అయితే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.