అవార్డు ఇస్తే.. కేసు వేస్తుంద‌ట‌

కంగ‌నా ర‌నౌత్ రూటే వేరు. ఆమె ఎడ్డెం అంటే తెడ్డెం అనే ర‌కం అని అంద‌రికీ తెలుసు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం రాజేయ‌డం ఆమెకు అల‌వాటే. ధ‌క‌డ్ సినిమా అల్ట్రా డిజాస్ట‌ర్ అయ్యాక కంగ‌నా కొంచెం సైలెంట్ అయింది. కొంత కాలంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ల‌లో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. కానీ ఇప్పుడు ఒక విచిత్ర‌మైన న్యూస్‌తో ఆమె వార్త‌ల్లోకి వ‌చ్చింది. త‌న‌కు అవార్డు ఇస్తాన‌న్నందుకు ఫిలిం ఫేర్ వాళ్ల మీద కేసు వేయ‌డానికి ఆమె సిద్ధం కావ‌డం విశేషం.

చాలా ఏళ్ల నుంచి కొన్ని ప్రైవేటు అవార్డుల‌ను కంగ‌నా బ‌హిష్క‌రిస్తోంది. అందులో ఫిలిం ఫేర్ కూడా ఉంది. గ‌తంలో ఆమెకు అవార్డులు ఆఫ‌ర్ చేసినా తిర‌స్క‌రించింది. ఐతే ఈసారి ఫిలిం ఫేర్ వాళ్లు త‌లైవి చిత్రానికి గాను కంగ‌నాకు ఉత్త‌మ న‌టిగా అవార్డు ఇవ్వాల‌నుకున్నార‌ట‌. ఇందుకోసం ఆమెకు కాల్ చేశార‌ట. ఐతే ఆమె తిర‌స్క‌రించింది.

అయినా స‌రే.. ఆప‌కుండా త‌న‌ను కాల్ చేసి విసిగిస్తున్నారంటూ ఫిలిం ఫేర్ వాళ్ల మీద మండిప‌డింది కంగ‌నా. తాను 2014 నుంచి అవార్డుల‌ను బ‌హిష్క‌రిస్తున్నాన‌ని.. అందులో ఇచ్చే అవార్డులు అవినీతి మ‌యం, అనైతికం అని.. కానీ ఇప్పుడు త‌లైవి చిత్రానికి త‌న‌కు అవార్డు ఇస్తామంటూ ఫోన్ చేసి విసిగిస్తున్నార‌ని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు పేర్కొంది కంగ‌నా.

తాను నో అన్న‌ప్ప‌టికీ త‌న పేరును నామినేట్ చేయ‌డం ప‌ట్ల తాను షాక‌య్యాన‌ని.. ఇలాంటి అవినీతి అవార్డులు అందుకోవ‌డానికి త‌న విలువ‌లు, నిబ‌ద్ధ‌త ఒప్పుకోవ‌ని.. అందుకే ఫిలిం ఫేర్ వాళ్ల మీద దావా వేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని కంగనా ఈ పోస్టులో వెల్ల‌డించింది. కంగ‌నా పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అవార్డు ఇస్తానంటే దావా వేయ‌డ‌మేంటి.. కంగనా తిక్కకు లెక్కే లేదు అంటూ ఆమె మీద కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.