మెగాస్టార్ కి మణి థాంక్స్ ఎందుకో..?

వచ్చే నెల 30న విడుదల కాబోతున్న మణిరత్నం విజువల్ వండర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 తెలుగు వెర్షన్ ప్రమోషన్లు మొదలు పెట్టేశారు.  తాజాగా క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరు కాగా హైదరాబాద్ వేదికగా చోళ చోళ సాంగ్ ని లాంచ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇంత గ్రాండ్ గా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడం ఇదే మొదలు. తమిళంతో పోలిస్తే ఇక్కడ దీని మీద ఆశించిన స్థాయిలో బజ్ లేదు. సెల్వన్ అంటే మనకు సంబంధం లేని వీరుడనే భావన టాలీవుడ్ ప్రేక్షకుల్లో  ఉండటంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అవసరమే.

ఈ వేడుకలో భాగంగా మణిరత్నం మాట్లాడుతూ తన ప్రసంగంలో చిరంజీవికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. కారణం వివరించలేదు. టైం వచ్చినప్పుడు బయటపెడతానని అన్నారు. ఇందులో ఏదైనా స్పెషల్ క్యామియో చేశారా లేక వాయిస్ ఓవర్ ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రావాలని అభిమానులు ఏళ్ళ తరబడి ఎదురు చూశారు. కానీ సాధ్యపడలేదు. అసలు మణిరత్నం తమిళం వదిలేసి తెలుగులో తీసింది ఒకే ఒక్క స్ట్రెయిట్ మూవీ. అది నాగార్జున గీతాంజలి. ఎలాంటి క్లాసిక్ గా నిలిచిపోయిందో అందరికీ తెలుసు.

మరి పొన్నియన్ సెల్వన్ కు సంబంధించి మెగాస్టార్ ప్రమేయం ఏమిటో ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ గొంతు మాత్రమే ఇచ్చి ఉంటే అదేమంత ఎగ్జైటింగ్ న్యూస్ కాదు. ఎందుకంటే చిరు ఇలా పరోక్షంగా భాగం తీసుకున్నవి ఆడిన దాఖలాలు అంతగా లేవు. తెలుగులోనూ పిఎస్ 1 గా చెలామణి చేస్తున్న ఈ గ్రాండియర్ గ్రాండ్ సక్సెస్ కావడం మణిరత్నంకు చాలా అవసరం. కెజిఎఫ్, బాహుబలి రేంజ్ లో హిట్టు కొడితేనే బిజినెస్ పరంగా సీక్వెల్ కు క్రేజ్ వస్తుంది. లేదంటే చాలా ఇబ్బందే. టీమ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నమ్మొచ్చనేలాగే ఉంది.